న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ 2030 నాటికి సోలార్ నుంచి హైడ్రోజన్ వరకు విస్తరించి ఉన్న కొత్త ఇంధన వ్యాపారం నుంచి 10–-15 బిలియన్ డాలర్ల (రూ.1.23 లక్షల కోట్ల) ను సంపాదింవచ్చని శాన్ఫోర్డ్ సి బెర్న్స్టెయిన్ నివేదిక పేర్కొంది. ఇందుకోసం విలీనాలు, పార్ట్నర్షిప్లు అవసరమని పేర్కొంది. క్లీన్ ఎనర్జీ (సోలార్, బ్యాటరీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్సెల్స్) రంగంలోకి 2050 నాటికి భారతదేశంలో 2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయి. దీంతో రిలయన్స్ ఆదాయం భారీగా పెరుగుతుంది. భారతదేశం 2030 నాటికి 280 గిగావాట్ల సోలార్ పవర్, ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.
క్లీన్ ఎనర్జీకి 2030 నాటికి 30 బిలియన్ డాలర్ల (ప్రస్తుతం 10 బిలియన్) టామ్ (టోటల్ అడ్రసబుల్ మార్కెట్) ఉండొచ్చని శాన్ఫోర్ట్ తెలిపింది. 2050 నాటికి టామ్ 200 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. రిలయన్స్ 2030 నాటికి 100 గిగావాట్ల ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ కెపాసిటీ ఉండాలని కోరుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన 280 గిగావాట్ల సామర్థ్యంలో ఇది 35 శాతం. 2030 నాటికి, రిలయన్స్ వరుసగా 60 శాతం, 30 శాతం 20 శాతం సోలార్, బ్యాటరీ హైడ్రోజన్ టామ్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని బెర్న్స్టెయిన్ చెప్పారు. ఫలితంగా న్యూ ఎనర్జీ వ్యాపారం నుంచి 10-–15 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలదని అంచనా వేస్తున్నామని చెప్పారు.