న్యూఢిల్లీ: హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్), ఐటీసీ వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలకు పోటీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఓ కన్జూమర్ బ్రాండ్ను తీసుకొచ్చింది. రిలయన్స్ రిటైల్కు చెందిన రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ‘ఇండిపెండెన్స్’ పేరుతో గుజరాత్లో ఈ బ్రాండ్ను మొదట లాంచ్ చేసింది. పిన్నుల మెషిన్ నుంచి శ్నాక్స్ వరకు వివిధ రకాల ప్రొడక్ట్లను అమ్ముతామని ఈ కంపెనీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. త్వరలో దేశమంతటా ఈ బ్రాండ్ను లాంచ్ చేస్తామని ప్రకటించింది. తమ సొంత ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ‘ఇండిపెండెన్స్’ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు. నాణ్యమైన ప్రొడక్ట్లను అందుబాటు ధరల్లోనే తీసుకొస్తామని పేర్కొన్నారు.
వంటనూనె, పప్పులు, ధాన్యాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రోజువారి వాడే ఇతర ఎసెన్షియల్ ప్రొడక్ట్లను ఈ బ్రాండ్ కింద అమ్ముతామని ప్రకటించారు. ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి ఎంటర్ అవుతామని ఈ ఏడాది ఆగస్ట్లో జరిగిన ఏజీఎంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఎఫ్ఎంసీజీ బిజినెస్ను మరింతగా విస్తరించేందుకు వివిధ బ్రాండ్లను కొనుగోలు చేయాలని రిలయన్స్ చూస్తోంది. గార్డెన్ నామ్కీన్, లాహోరి జీరా, బిందు బెవరేజెస్ వంటి బ్రాండ్లను కొనుగోలు చేసేందుకు కంపెనీలతో చర్చలు జరుపుతోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు.