- క్యూ4 లో రూ.2,40,715 కోట్లు, 2023–24 లో రూ. 9,14,472 కోట్ల రెవెన్యూ సాధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్
- మార్చి క్వార్టర్లో రూ. 18,951 కోట్లకు,పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.69,621 కోట్లకు ప్రాఫిట్
- షేరుకి రూ.10 డివిడెండ్
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది మార్చి క్వార్టర్ (క్యూ4) లో రూ.2,40,715 కోట్ల రెవెన్యూ (కన్సాలిడేటెడ్) సాధించింది. కిందటేడాది మార్చి క్వార్టర్లో వచ్చిన రూ.2,16,265 కోట్లతో పోలిస్తే 11.3 శాతం గ్రోత్ నమోదు చేసింది. కంపెనీ నికర లాభం రూ. 19,299 కోట్ల నుంచి 1.8 శాతం తగ్గి రూ. 18,951 కోట్లుగా రికార్డయ్యింది. ప్రాఫిట్ 5–10 శాతం మేర తగ్గుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్కు రూ.9,14,472 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.8,91,311 కోట్లు సాధించింది. నికర లాభం రూ. 66,702 కోట్ల నుంచి రూ.69,621 కోట్లకు చేరుకుంది.
పుంజుకుంటున్న గ్యాస్ బిజినెస్..
2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకి రూ.10 డివిడెండ్ ఇవ్వాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నిర్ణయించింది. యాన్యువల్ జనరల్ మీటింగ్లో దీనిని ఫైనలైజ్ చేయనున్నారు. సెగ్మెంట్ వైజ్గా చూస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ టూ కెమికల్ (ఓటూసీ) బిజినెస్ ఈ ఏడాది మార్చి క్వార్టర్లో రూ. 1,42,634 కోట్ల రెవెన్యూ సాధించింది. కిందటేడాది మార్చి క్వార్టర్లో రూ.1,28,634 కోట్లు వచ్చాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఓటూసీ బిజినెస్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్కు రూ. 5,64,749 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఆయిల్ టూ గ్యాస్ సెగ్మెంట్ నుంచి కంపెనీకి క్యూ4 లో రూ.6,468 కోట్లు, పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.16,508 కోట్ల రెవెన్యూ వచ్చింది.
పెరిగిన జియో, రిటైల్ రెవెన్యూ..
రిలయన్స్ ఇండస్ట్రీస్కు రిలయన్స్ రిటైల్ నుంచి క్యూ4 లో రూ. 76,683 కోట్ల రెవెన్యూ వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్లో రూ. 69,275 కోట్లు ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ రెవెన్యూ రూ.2,60,394 కోట్ల నుంచి రూ. 3,06,848 కోట్లకు (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగింది. టెలికం బిజినెస్ జియో నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్కు క్యూ4 లో రూ.25,959 కోట్ల రెవెన్యూ, రూ.5,337 కోట్ల నికర లాభం వచ్చాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్కు మొత్తం డిజిటల్ సర్వీస్ల నుంచి క్యూ4 లో రూ. 34,741 కోట్ల రెవెన్యూ రాగా, 2023–24 లో రూ.1,32,938 కోట్లు వచ్చింది. ‘రూ.లక్ష కోట్ల ప్రాఫిట్ (పన్నుల కంటే ముందు) సాధించిన మొదటి ఇండియన్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. సబ్స్క్రయిబర్లు పెరగడంతో డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ పుంజుకుంది. వ్యాపారులను బలోపేతం చేసేందుకు రిలయన్స్ రిటైల్ వివిధ ఇనీషియేటివ్లను తీసుకొస్తోంది. కెమికల్ ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నప్పటికీ మంచి పెర్ఫార్మెన్స్ చేశాం. కేజీ డీ6 బ్లాక్లో ప్రొడక్షన్ పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్లో 30 శాతం ఇక్కడి నుంచే వస్తోంది. ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్లకు కట్టుబడి ఉన్నాం’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మ న్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.