- రిలయన్స్, జియోకి రూ.41 వేల కోట్ల లోన్
- ఇప్పటికే రూ.24,600 కోట్లు
- 55 బ్యాంకుల నుంచి తీసుకున్న రిలయన్స్
- మరో రూ.16,400 కోట్లు సేకరించేందుకు జియో రెడీ
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఈ కంపెనీ సబ్సిడరీ జియో ఇన్ఫోకామ్ ఏకంగా 5 బిలియన్ డాలర్లు (రూ. 41 వేల కోట్లు) సేకరించాయి. ఫారిన్ కరెన్సీ లోన్స్ (బ్యాంకులు తమ ఫారిన్ కరెన్సీ ఫండ్స్ నుంచి ఇచ్చేవి) కింద రిలయన్స్, జియో ఈ ఫండ్స్ సేకరించాయి. ఇండియన్ కార్పొరేట్ హిస్టరీలో ఇదే అతిపెద్ద సిండికేట్ లోన్ ( వివిధ బ్యాంకులు కలిసి ఇవ్వడం). రిలయన్స్ కిందటి వారం 55 బ్యాంకుల నుంచి 3 బిలియన్ డాలర్లు (రూ.24,600 కోట్లు) సేకరించింది.
ఈ బ్యాంకుల్లో 19 తైవనీస్ బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, ఎంయూఎఫ్జీ, సిటీ, ఎస్ఎంబీసీ, మిజుహో, క్రెడిట్ అగ్రికోల వంటి టాప్ గ్లోబల్ బ్యాంకులూ ఉన్నాయి. ఈ ఫైనాన్సింగ్ డీల్ను రిలయన్స్ కిందటి నెల 31 న క్లోజ్ చేసింది. జియో ఇన్ఫోకామ్ అదనంగా మరో 2 బిలియన్ డాలర్ల (రూ. 16,400 కోట్ల) ను 18 బ్యాంకుల నుంచి సేకరించనుంది. ఈ లోన్ను మంగళవారం దక్కించుకోగా, ఈ నెల చివరి నాటికి డీల్ పూర్తి చేయాలని చూస్తోంది. తాజాగా సేకరించిన ఫండ్స్తో దేశం మొత్తం మీద 5జీ నెట్వర్క్ను డెవలప్ చేయాలన్నది జియో ప్లాన్.
2 బిలియన్ డాలర్ల లోన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో సమానంగా పంచుకుంటాయి. మొత్తం 5 బిలియన్ డాలర్ల లోన్ను ఒకే టెర్మ్ కింద రిలయన్స్ దక్కించుకుంది. ఆయిల్ నుంచి టెలికం వరకు వివిధ బిజినెస్లలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్కు లోన్లు ఇచ్చేందుకు లోకల్ బ్యాంకులతో పాటు విదేశీ బ్యాంకులు కూడా ఎగబడుతున్నాయి.