న్యూఢిల్లీ: రూ. 19 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను టచ్ చేసిన మొదటి ఇండియన్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. కంపెనీ షేర్లు బుధవారం సెషన్లో 1.85 శాతం పెరిగి రూ. 2,827 వద్ద ఆల్ టైమ్ హైని రికార్డ్ చేశాయి. ఈ రేటు దగ్గర కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 19 లక్షల కోట్లను క్రాస్ చేసింది. కంపెనీ షేర్లు చివరికి 0.08 శాతం లాభంతో రూ. 2,778 వద్ద బుధవారం క్లోజయ్యాయి. గత కొన్ని సెషన్ల నుంచి రిలయన్స్ షేరు పెరుగుతూ వస్తోంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా పెరుగుతోంది. బుధవారం సెషన్లో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 19,12,814 కోట్లను టచ్ చేసి తిరిగి కిందకి పడింది. సెషన్ క్లోజింగ్ నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 18,79,237 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 18 లక్షల కోట్లను క్రాస్ చేయగా, కిందటేడాది అక్టోబర్ 13 న రూ. 17 లక్షల మార్కెట్ క్యాప్ను దాటింది. రిలయన్స్ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 17.30 % లాభపడింది.
యూఏఈలో జాయింట్ వెంచర్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 బిలియన్ డాలర్లతో యూఏఈలో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. టాజిజ్ కెమికల్ను ఏడీఎన్ఓసీతో కలిసి కంపెనీ ఏర్పాటు చేస్తోంది. సాధారణ, అసాధారణ రిసోర్స్లను ఈ జాయింట్ వెంచర్ గుర్తిస్తుంది.