న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. అదానీ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ పవర్లో 26 శాతం వాటాను కైవసం చేసుకుంది. ఈ ప్లాంటు నుంచి 500 మెగావాట్ల కరెంటును వాడుకోవడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. అదానీ పవర్ లిమిటెడ్కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్లో రిలయన్స్ 5 కోట్ల ఈక్విటీ షేర్లను 10 రూపాయల ముఖ విలువతో (రూ. 50 కోట్లు) తీసుకుంటుంది.
గుజరాత్కు చెందిన ఈ ఇద్దరు వ్యాపారవేత్తలు తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆసియాలోనే అత్యంత ధనికుడిగా మారేందుకు పోటిపడుతున్నారు. అంబానీకి చమురు, గ్యాస్, రిటైల్, టెలికాం వ్యాపారాలు ఉన్నాయి. అదానీకి విమానాశ్రయాలు, బొగ్గు, మైనింగ్, క్లీన్ ఎనర్జీ, సిమెంట్వ్యాపారాలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో జామ్నగర్లో అంబానీ చిన్న కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అదానీ కూడా హాజరయ్యారు.
అంబుజా సిమెంట్స్లో వాటా పెంచుకున్న అదానీ గ్రూప్
అంబుజా సిమెంట్స్లో అదానీ గ్రూప్ 21.20 కోట్ల వారెంట్లను షేర్లుగా మార్చడం ద్వారా రూ.6,661 కోట్లను ఇన్వెస్ట్చేసి వాటాను పెంచుకుంది. దేశంలోని రెండవ అతిపెద్ద సిమెంట్ కంపెనీలో తన వాటాను 3.6 శాతం పెంచుకుంది. దీంతో మొత్తం వాటా 66.7 శాతానికి చేరుకుంది. ఇదిలా ఉంటే, అదానీ గ్రూప్ గుజరాత్లోని ముంద్రాలో రాగి తయారీ ఫ్యాక్టరీ మొదటి దశను గురువారం ప్రారంభించింది. ఇది దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.