న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్లో కొద్దిగా పెరిగి (ఏడాది ప్రాతిపదికన 0.2 శాతం) రూ.15,512 కోట్లుగా నమోదయ్యింది. కంపెనీ రెవెన్యూ (కన్సాలిడేటెడ్) క్యూ2 లో 32.4 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ.2,53,497 కోట్లకు చేరుకుంది. ఆయిల్ బిజినెస్ రెవెన్యూ 34.5% పెరిగి రూ.1,59,671 కోట్లుగా నమోదయ్యింది. ఈ బిజినెస్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 25.1 % తగ్గి రూ.6,915 కోట్లుగా రికార్డయ్యింది. ఆయిల్ బిజినెస్లో రిఫైనింగ్ మార్జిన్స్ తగ్గడం, విండ్ఫాల్ ట్యాక్స్ వలన కంపెనీ ప్రాఫిట్స్ (కన్సాలిడేటెడ్) తగ్గాయి. ప్రభుత్వం విధించిన అదనపు ట్యాక్స్ వలన రూ. 4,039 కోట్లు నష్టపోయామని కంపెనీ పేర్కొంది. అయినప్పటికీ కంపెనీ రిటైల్, డిజిటల్ బిజినెస్లు మంచి పెర్ఫార్మెన్స్ చేశాయి.
రిటైల్ బిజినెస్ లాభం రూ. 2,305 కోట్లు
రిటైల్ బిజినెస్ గ్రాస్ రెవెన్యూ కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే 43% ఎగిసి రూ.64,920 కోట్లకు చేరుకుంది. కిందటి ఆర్థిక సంవత్సరం క్యూ2 లో రూ.45,426 కోట్ల రెవెన్యూ వచ్చింది. నికర లాభం 36 % పెరిగి రూ.2,305 కోట్లుగా రికార్డయ్యింది. క్యూ2 ముగిసే నాటికి రిలయన్స్ రిటైల్ 16,617 ఫిజికల్ స్టోర్లను ఆపరేట్ చేస్తోంది. ఇందులో 795 స్టోర్లు క్యూ2 లో ఓపెన్ చేసింది.
జియో సూపర్
రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) లో రూ. 4,729 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే ఇది 22.8% ఎక్కువ. కంపెనీ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 27 % పెరిగి రూ.28,506 కోట్లకు ఎగిసింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో రూ.23,222 కోట్ల రెవెన్యూని కంపెనీ ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్ ముగిసే నాటికి కంపెనీ మొత్తం కస్టమర్లు 42.76 కోట్లకు చేరుకున్నారు. కస్టమర్లు పెరగడంతో యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ నెలకు రూ. 177.2 కి పెరిగిందని జియో పేర్కొంది.