
- రూ.2.59 లక్షల కోట్ల రెవెన్యూ
- మెరుగుపడిన జియో ఆర్పూ.. పెరిగిన రిటైల్ ఆదాయం
- ఓకే అనిపించిన ఓ2సీ బిజినెస్
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఈ ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2)లో రూ.18,165 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.16,563 కోట్లతో పోలిస్తే లాభం10శాతం పెరిగింది. ఈ క్వార్టర్లో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.2.59 లక్షల కోట్లుగా ఉంది. ఇది కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చిన రూ.2.35 లక్షల కోట్లతో పోలిస్తే 10శాతం అధికం.
నికర లాభం మార్కెట్ అంచనాలైన రూ.18,643 కోట్ల కంటే తక్కువగా నమోదు అయినప్పటికీ, మొత్తం ఆదాయం మాత్రం రూ.2.51 లక్షల కోట్ల అంచనాలను అధిగమించింది. ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా కలుపుకుంటే ఆర్ఐఎల్ గ్రాస్ రెవెన్యూ రూ.2.83 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది కూడా ఏడాది లెక్కన 10శాతం వృద్ధి చెందింది. వడ్డీ, పన్ను, డిప్రిషియేషన్, అమార్టైజేషన్కు ముందు లాభం (ఇబిటా) రూ.50,367 కోట్లుగా నమోదైంది.
ఇది ఏడాది లెక్కన 15శాతం వృద్ధికి సమానం. ఇబిటా మార్జిన్ 17.8శాతంగా రికార్డయ్యింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 80 బేసిస్ పాయింట్లు పెరిగింది. అయితే ఈ ఏడాది జూన్ క్వార్టర్ (క్యూ1)లో వచ్చిన రూ.26,994 కోట్లతో పోలిస్తే మాత్రం కంపెనీ నెట్ ప్రాఫిట్ క్యూ2లో 33శాతం తగ్గింది. కానీ ఆదాయం క్వార్టర్ ప్రాతిపదికన 4శాతం పెరిగింది. క్యూ1లో రూ.2.49 లక్షల కోట్ల ఆదాయం సాధించింది.
విభాగాల వారీగా..జియో ప్లాట్ఫామ్స్
ఈ కంపెనీ ఆదాయం ఏడాది లెక్కన 14.9శాతం పెరిగి రూ.36,332 కోట్లకు చేరుకుంది. ప్రాఫిట్ 13 శాతం వృద్ధి చెంది రూ.7,379 కోట్లుగా నమోదైంది. మొబైట్ నెట్వర్క్, హోమ్ విభాగాల్లో సబ్స్క్రైబర్స్ పెరగడంతో యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) రూ.211.4 కి మెరుగుపడింది. జియో కస్టమర్ల సంఖ్య 50 కోట్ల మార్క్ను దాటింది. డిజిటల్ సేవలను విస్తరించడమే ఇందుకు కారణం. జియో ఇబిటా ఏడాది లెక్కన 17.7శాతం పెరిగి రూ.18,757 కోట్లుగా ఉంది.
రిలయన్స్ రిటైల్
రిలయన్స్ రిటైల్ నెట్ ప్రాఫిట్ క్యూ2 లో ఏడాది లెక్కన 22 శాతం పెరిగి రూ.3,457 కోట్లకు, ఆదాయం 19శాతం పెరిగి రూ.79,128 కోట్లకు చేరుకున్నాయి. గ్రాసరీ, ఫ్యాషన్ విభాగాల్లో సేల్స్ పెరిగాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఏడాది లెక్కన 18శాతం వృద్ధి నమోదైంది. జీఎస్టీ తగ్గింపు, కొత్త ఉత్పత్తుల లాంచ్లు కారణంగా సేల్స్ ఊపందుకున్నాయి. స్టోర్ విస్తరణ, హైపర్లోకల్ డెలివరీలు, ఆపరేషనల్ ఎఫిషియెన్సీపై కంపెనీ ఫోకస్ పెట్టింది.
ఆయిల్ టు కెమికల్స్
ఓ2సీ విభాగం ఆదాయం ఏడాది లెక్కన 3.2శాతం పెరిగి రూ.1.60 లక్షలకు చేరుకుంది. ఇబిటా రూ.15,008 కోట్లుగా నమోదైంది. ఏడాది లెక్కన 20.9శాతం పెరిగింది. పెట్రోల్, డీజిల్ వంటి రవాణా ఇంధనాలతో పాటు, పాలిమర్ డెల్టాల సేల్స్ పెరగడంతో కారణంగా లాభం పెరిగింది. పాలిస్టర్ మార్జిన్స్ మాత్రం కొంత తగ్గాయి. రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ విభాగం ఆదాయం క్యూ2లో 2.6శాతం తగ్గి రూ.6,058 కోట్లకు చేరుకుంది.
ఓ2సీ, జియో, రిటైల్ విభాగాల్లో బలమైన పనితీరుతో మంచి ఫలితాలు సాధించాం. కంపెనీ కన్సాలిడేటెడ్ ఇబిటా ఏడాది లెక్కన 14.6శాతం వృద్ధిని నమోదు చేసింది. మెరుగైన వ్యాపార విధానాలు, దేశీయంగా దృష్టి పెట్టడం, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండడంతో ఇది సాధ్యమైంది.
- ముకేశ్ అంబానీ, రిలయన్స్ చైర్మన్