- రూ.12,900 కోట్లు తెచ్చుకున్న ఆర్ఐఎల్
- మూలధన ఖర్చుల కోసమే..
- సీఎస్ఆర్ వివరాలు ఎంసీఏకు..
న్యూఢిల్లీ : ఆయిల్ నుంచి టెలికాం వ్యాపారాల వరకు విస్తరించి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) విదేశాల నుంచి అప్పు తెచ్చుకుంది. విదేశీ లెండర్లతో అగ్రిమెంట్ కుదుర్చుకుని లాంగ్ టర్మ్ లోన్స్ కింద రూ.12,900 కోట్ల అప్పు తెచ్చుకున్నట్టు ఆర్ఐఎల్ వెల్లడించింది. ఈ మొత్తాన్ని మూలధన ఖర్చుల కోసం వినియోగించనున్నట్టు తెలిపింది. టెలికాం యూనిట్ జియోకి రూ.20 వేల కోట్లను అందించనున్నట్టు వస్తోన్న వార్తల నేపథ్యంలో కంపెనీ ఈ నిధులను సేకరించింది. భవిష్యత్తులో బ్రాడ్బ్యాండ్, ఈకామర్స్, 5జీ మొబైల్ టెలిఫోన్ సర్వీసుల్లోకి ఎంటర్ కావడం కోసం జియోకు రూ.20వేల కోట్లు ఆర్ఐఎల్ ఇస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
‘1.85 బిలియన్ డాలర్ల(రూ.12,900 కోట్ల) దీర్ఘకాలిక రుణాల కోసం ఆఫ్షోర్ లెండర్స్తో కంపెనీ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రధానంగా ఈ మొత్తాన్ని మూలధన ఖర్చుల కోసం వాడనున్నాం’ అని ఆర్ఐఎల్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఈ రుణాలకు సంబంధించిన టెన్యూర్, వడ్డీరేటు వంటి వివరాలను కంపెనీ తెలుపలేదు. రూ.1,700 కోట్ల సీఎస్ఆర్ ఫండ్ను అక్రమంగా దారి మళ్లించినందుకు గాను.. ప్రభుత్వ కనుసన్నల్లో ఆర్ఐఎల్ ఉందని వస్తోన్న రిపోర్ట్లపై కూడా కంపెనీ మరో ఫైలింగ్ దాఖలు చేసింది. తమ సీఎస్ఆర్ కార్యకలాపాలపై టైమ్ టూ టైమ్ సమాచారం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) కోరుతోందని ఆర్ఐఎల్ తెలి పింది. ఎంసీఏకు తాము సమాచారం అందిస్తున్నామని చెప్పింది.