న్యూఢిల్లీ : కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్లను తయారు చేసే మిమోస నెట్వర్క్స్ను రిలయన్స్ జియో కొనుగోలు చేయనుంది. జియో ప్లాట్ఫామ్స్కు సబ్సిడరీ కంపెనీ అయిన రాడిసిస్ కార్పొరేషన్ 60 మిలియన్ డాలర్ల (రూ.492 కోట్ల) కు ఈ కంపెనీని కొననుంది. మిమోస హోల్డింగ్ కంపెనీ ఎయిర్స్పాన్ నెట్వర్క్స్ హోల్డింగ్స్తో రాడిసిస్ డెఫినెటివ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాగా, జియో ప్లాట్ఫామ్స్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు సబ్సిడరీ. వైఫై 5, వైఫై 6ఈ టెక్నాలజీస్కు సంబంధించిన ఎక్విప్మెంట్లను మిమోస తయారు చేస్తోంది. 5జీ టెక్నాలజీలో సాయపడే ఎక్విప్మెంట్లను కూడా ఈ యూఎస్ కంపెనీ తయారు చేస్తోంది. మిమోసను 2018 లో ఎయిర్స్పాన్ కొనుగోలు చేసింది. రాడిసిస్ను కొనుగోలు చేశాక కూడా మిమోసకు చెందిన 56 మంది ఉద్యోగులు కొనసాగుతారు.టెలికం నెట్వర్క్ ప్రొడక్ట్స్లలో ఇన్నోవేషన్స్కు మిమోస సాయపడుతుందని జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఓమెన్ అన్నారు.
రాష్ట్రంలోని మరో 8 సిటీల్లో జియో 5జీ
రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను రాష్ట్రంలోని మరో 8 నగరాల్లో ప్రారంభించింది. కొత్తగా జియో 5జీ సేవలు... సిద్ధిపేట, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్ల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 నగరాల్లో.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల లో రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది . కొత్తగా ప్రారంభించిన 8 నగరాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణలోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది.