
న్యూఢిల్లీ: ఫిక్స్డ్ లైన్ టెలికం విభాగంలో రిలయన్స్ జియో మనదేశంలోనే నంబర్వన్ గా ఎదిగింది. ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ను ఈ ఏడాది ఆగస్టులో అధిగమించి అతిపెద్ద ఫిక్స్డ్ లైన్ సర్వీస్ ప్రొవైడర్గా అవతరించింది. దీంతో బీఎస్ఎన్ఎల్ రెండోస్థానానికి దిగజారింది. దేశంలో టెలికం సేవలు ప్రారంభించిన తర్వాత వైర్లైన్ విభాగంలో ఓ ప్రైవేట్ కంపెనీ మొదటిస్థానంలోకి రావడం ఇదే మొదటిసారి. టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ప్రస్తుతం జియో ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ‘జియో ఫైబర్’ యూజర్ల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. బీఎస్ఎన్ఎల్కు 71.32 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఎయిర్టెల్ 61.9 లక్షల మంది కస్టమర్లతో మూడోస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో బీఎస్ఎన్ఎల్ 15,734 మంది కస్టమర్లను కోల్పోయింది. జియోకు 2.62 లక్షలు, ఎయిర్టెల్కు 1.19 లక్షలు, వోడాఫోన్ ఐడియా కు 4,202, టాటా టెలి సర్వీసుకు 3,769 మంది కస్టమర్లు కొత్తగా చేరారు. వైర్లెస్ మొబైల్ నెట్వర్క్ సబ్స్క్రయిబర్ల విషయంలోనూ జియో నంబర్వన్గా నిలిచింది. దేశంలో మొత్తం బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య 81.39 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఆగస్టులో జియో కొత్తగా 32.8 లక్షల మంది సబ్స్క్రయిబర్లను సంపాదించుకుంది. దీంతో తన మొత్తం కస్టమర్ బేస్ 41.92 కోట్లకు పెరిగింది. ఫలితంగా దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. అయితే, ఎయిర్టెల్ 3.26 లక్షల మంది కస్టమర్లను, వోడాఫోన్ ఐడియా 19.58 లక్షల మంది, బీఎస్ఎన్ఎల్ 5.67 లక్షల మంది, ఎంటీఎన్ఎల్ 470 మంది యూజర్లను కోల్పోయింది. దేశవ్యాప్తంగా మొత్తం మొబైల్ టెలికాం యూజర్ల సంఖ్య 117.36 కోట్ల నుండి 117.50 కోట్లకు పెరిగింది. ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లో జియో 1.70 లక్షలకు పైగా కొత్త చందాదారులను చేర్చుకుందని ట్రాయ్ డేటా తెలిపింది.
రూ.1353 కోట్ల విలువైన విల్లా కొన్న అంబానీ
భారతదేశంలోని రెండవ అత్యంత సంపన్నుడు, రిలయన్స్ చైర్పర్సన్ ముకేశ్ అంబానీ దుబాయ్లో 163 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,353.28 కోట్లు) పెట్టి బీచ్-సైడ్ విల్లా కొన్నారు. ఆయన తన గత రికార్డును నెలరోజుల్లోనే బద్దలు కొట్టారు. ఇటీవల అంబానీ 83 మిలియన్ డాలర్ల విలువైన విల్లా కొన్నారు. తాజాగా కువైట్ వ్యాపారవేత్త మహ్మద్ అల్షాయా కుటుంబం నుంచి పామ్ జుమేరా మాన్షన్ను కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం భారతదేశపు అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ అంబానీ నెట్వర్త్ 84 బిలియన్ డాలర్లు. విదేశాలలో ఆయన భారీగా ఆస్తులను కొంటున్నారు. పోయిన ఏడాది యూకేలోని కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్ను కొనుగోలు చేశారు. ఇందుకు 79 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంబానీ న్యూయార్క్లోనూ ప్రాపర్టీ కోసం వెతుకుతున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనాభాలో 80శాతం కంటే ఎక్కువ విదేశీయులే ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థకు వీళ్లే మూలస్తంభంగా ఉన్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్చేస్తున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే కావడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి, యూఏఈలో ఆస్తి ధరలు గత సంవత్సరం కంటే 70 శాతం పెరిగాయి.