
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ భారీగా నిధులు సేకరించాలని చూస్తోంది. ఈ నెల చివరిలోపే సుమారు 2.5 బిలియన్ డాలర్ల (రూ.20,500 కోట్ల) ను సేకరించేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. 3.5 బిలియన్ డాలర్లను సేకరించాలని రిలయన్స్ రిటైల్ టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ 2.5 బిలియన్ డాలర్లను సేకరించనుంది. ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ నుంచి ఒక బిలియన్ డాలర్లను సేకరించామని కంపెనీ కిందటి నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ఫండ్స్ను 100 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ దగ్గర సేకరించారు. రిలయన్స్ రిటైల్ దేశంలోని అతిపెద్ద రిటైలర్లలో ఒకటి. ఈ కంపెనీ గ్రోసరీల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు వివిధ ప్రొడక్ట్లను అమ్ముతోంది. అంతేకాకుండా బర్బెర్రీ, ప్రెట్ ఏ మాంగర్ వంటి ఫారిన్ బ్రాండ్లతో టై అప్ అయ్యింది. పెట్టుబడుల సేకరణ కోసం యూఎస్కు చెందిన రెండు ఫండ్స్తో కంపెనీ చర్చలు జరుపుతోందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. ఇప్పటికే షేర్ హోల్డర్లుగా ఉన్నవారు కూడా మరింతగా ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు.
వీరిలో కొన్ని సావరిన్ వెల్త్ ఫండ్స్ కూడా ఉన్నాయని అన్నారు. రిలయన్స్ రిటైల్ 2020 లో 10.09 శాతం వాటాను 5.71 బిలియన్ డాలర్లకు అమ్మింది. కేకేఆర్, సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, జనరల్ అట్లాంటిక్, యూఏఈ ముబాదల ఇన్వెస్ట్ చేశాయి. 52 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్ దగ్గర ఈ ఫండ్స్ సేకరించామని, ప్రస్తుతం కంపెనీ వాల్యుయేషన్ డబుల్ అయ్యిందని 46 వ ఏజీఎంలో ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.