
- తగ్గిన రెమిటెన్స్ ట్యాక్స్.. 3.5 శాతం నుంచి ఒక శాతానికి
- బ్యాంక్ అకౌంట్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ల ద్వారా జరిగితే నో ట్యాక్స్
న్యూఢిల్లీ: యూఎస్లోని ఇమ్మిగ్రెంట్స్ పంపించే రెమిటెన్స్ (డబ్బుల)పై 3.5 శాతం ట్యాక్స్ వేస్తామని గతంలో ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా దీనిని ఒక శాతానికి తగ్గించారు. సెనేట్లో ప్రవేశపెట్టిన తాజా బిల్ డ్రాఫ్ట్లో ఒక శాతానికి తగ్గించారని అమెరికన్ పొలిటికల్ న్యూస్ పేపర్ పొలిటికో వెల్లడించింది. అమెరికాలో నివసిస్తున్న ఇమ్మిగ్రెంట్ల రెమిటెన్స్లపై టాక్స్ విధించేందుకు ట్రంప్ ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను తెచ్చిన విషయం తెలిసిందే. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ ఏడాది మేలో ఈ బిల్ను ఆమోదించింది.
ప్రస్తుతం సెనేట్లో చర్చలో ఉంది. మొదట 5శాతం టాక్స్ ప్రతిపాదించగా, హౌస్ ఆమోదం ముందు 3.5శాతానికి తగ్గించారు. తాజా డ్రాఫ్ట్లో దీనిని ఒక శాతానికి తగ్గించి, బ్యాంక్ అకౌంట్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ల ద్వారా చేసే రెమిటెన్స్లకు టాక్స్ మినహాయింపు ఇచ్చారు. క్యాష్, మనీ ఆర్డర్, క్యాషియర్స్ చెక్ ద్వారా చేసే రెమిటెన్స్లకు ఒక శాతం టాక్స్ వర్తిస్తుంది. ఎన్ఆర్ఐలు, హెచ్1బీ సిబ్బంది, ఇండియన్ స్టూడెంట్స్ ఈ టాక్స్ వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. ఈ బిల్లుకు ఆమోదం దక్కితే వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది.
ఇండియాకు రూ.11.51 లక్షల కోట్ల రెమిటెన్స్
విదేశాల్లోని భారతీయులు పంపే డబ్బులు (రెమిటెన్స్) 2024–25 లో రికార్డు స్థాయికి చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ భారతీయులు రూ.11,51,410 కోట్ల (135.46 బిలియన్ డాలర్ల)ను ఇండియాకు పంపారు. ఇది కొత్త రికార్డు. భారత్ గత పదేళ్లుగా ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్ స్వీకరించే దేశంగా కొనసాగుతోంది. యూఎస్, యూకే, సింగపూర్ వంటి దేశాలకు స్కిల్డ్ లేబర్స్ వలస వెల్లడం వల్ల రెమిటెన్స్ పెరిగాయి. ఈ మూడు దేశాలు 45 శాతం రెమిటెన్స్ ఇస్తున్నాయి. అయితే గల్ఫ్ దేశాల వాటా తగ్గుతోందని వెల్లడయింది.