రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అనుగుణంగా రాష్ట్రంలోని రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ఆలయాల నిర్వహణను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరిధి నుంచి తొలగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని జస్టిస్ చెల్లకూరు సుమలత ఇటీవల విచారణ చేపట్టి ప్రతివాదులైన దేవా దాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.
కోదండరామ శర్మ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని తెలంగాణ సర్కార్ అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన నాగిళ్ల శ్రీనివాస్ మరో ఇద్దరు పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ రిజిస్ట్రర్ చేసిన ఆలయాలు పది వేల వరకు ఉన్నాయని, పెద్ద ఆలయాలు మినహా చిన్నపాటి రాబడి ఉన్న ఆలయాలు కూడా ప్రభుత్వానికి సీజీఎఫ్, కంట్రిబ్యూషన్ కడుతున్నాయని పిటిషనర్ లాయర్ చెప్పారు. ఒక్కో ఆలయం రూ.37 వేల నుంచి రూ.92,500 వరకు ప్రభుత్వానికి ఏటా కడుతున్నాయని వివరించారు.