దేశవ్యాప్తంగా లోక్సభ తొలిదశ ఎన్నికలు ఏప్రిల్ 19న ముగిశాయి. మణిపూర్ రాష్ట్రంలోని ఇన్నర్ మణిపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 11 చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొంతమంది పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడిన కాల్పులు చేశారు. ఎలక్షన్ సిబ్బందిని బెదిరించి ఈవీఎం మెషన్లను పగలగొట్టారు. దీంతో ఆ 11 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 22న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఈమేరకు మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రకటించారు. ఏప్రిల్ 19న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మణిపూర్లోని ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ స్థానాల్లో 72 శాతం పోలింగ్ నమోదయింది. అయితే కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తం 47 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇన్నర్ మణిపూర్లో 36 చోట్ల, ఔటర్ మణిపూర్లో 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది.