
నస్పూర్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. జాప్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఫెడరేషన్మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభకు హాజరై, మాట్లాడారు. జర్నలిస్టులకు అండగా నిలిచిచే ఏకైక యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ అన్నారు. గత ప్రభుత్వానికి ఒక యూనియన్ వంతపాడితే.. ప్రస్తుత ప్రభుత్వానికి మరో యూనియన్ వంత పాడుతోందని ఆరోపించారు.
జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు రూ.20 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా మూడు నెలలకోసారి స్టిక్కర్ల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమంపై ఆలోచించి, న్యాయం చేయాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్, ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్, జిల్లా సన్నాహక కమిటీ కన్వీనర్ మధు తదితరులు పాల్గొన్నారు.