న్యూఢిల్లీ: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం జులై నెలలో స్వల్పంగా పెరిగి 4.45 శాతానికి చేరింది. ప్రధానంగా కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) బుధవారం పేర్కొంది.
ఈ ఏడాది జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) 4.38 శాతంగా ఉండగా, జులైలో 4.45 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 5.32 శాతం నుంచి 5.52 శాతానికి ఎగిసింది.
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద నియంత్రించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోగా, దీనిని కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజా మానిటరీ పాలసీ మీటింగ్లో వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది.
