- ఇన్వెంటరీ వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న రిటైలర్లు
- తగ్గుతున్న డిమాండ్..
- త్వరలో సేల్స్ తెచ్చే ఆలోచనలో లైఫ్స్టైల్, వీ మార్ట్, పాంటలూన్స్, ఆదిత్య బిర్లా, పేజ్ ఇండస్ట్రీస్లు
న్యూఢిల్లీ: ఈ సారి ‘ఎండ్ ఆఫ్ సీజన్’ సేల్స్ ముందే వచ్చేటట్టు కనిపిస్తున్నాయి. క్లాత్స్, చెప్పులు, ఇతర లైఫ్ స్టైల్ బ్రాండ్లు తమ ఇన్వెంటరీని క్లియర్ చేసుకోవడానికి ఫ్లాష్ డిస్కౌంట్లను ప్రకటించే అవకాశం ఉంది. సాధారణంగా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అంటూ జూన్ చివరిలో (సమ్మర్ చివరిలో) భారీ డిస్కౌంట్లతో సేల్స్ స్టార్టవుతాయి. కానీ, వివిధ బ్రాండ్లు ప్రస్తుతం తమ ప్రొడక్ట్ల రేట్లను తగ్గించడానికి లేదా రానున్న వారాల్లో ఫ్లాష్ సేల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ‘కిందటేడాది బాగా సేల్స్ జరిగాయి. దీంతో బ్రాండ్లు ఈ ఏడాది కూడా ఇలాంటి మూమెంటమే ఉంటుందని అంచనా వేశాయి’ అని వీ మార్ట్ చైర్మన్ లలిత్ అగర్వాల్ పేర్కొన్నారు.
కానీ, ఫిబ్రవరి తర్వాత నుంచి కంపెనీలకు ఇబ్బందులు మొదలయ్యాయని, మే నెలలో పరిస్థితులు కొంత మెరుగుపడినా అది సరిపోదని అన్నారు. దీంతో రిటైలర్లు అనుకున్న దాని కంటే ముందే డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయని చెప్పారు. తాము గతంలో ధరలు పెంచామని, ఫలితంగా డిమాండ్ పడిపోయిందని, తాజాగా రేట్లను తగ్గించామని వివరించారు. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పటకీ కిందటేడాది కన్జూమర్లు షాప్లకు క్యూ కట్టారు. కరోనా తర్వాత పెంటప్ డిమాండ్ నెలకొనడంతో సేల్స్ భారీగా జరిగాయి. కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. గత కొన్ని నెలలుగా సేల్స్ గ్రోత్ నెమ్మదించడాన్ని గమనించొచ్చు.ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో గ్రోత్ 6 శాతానికి తగ్గిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. గత 14 నెలల్లో ఇదే అతి తక్కువ సేల్స్ గ్రోత్ అని వెల్లడించింది.
స్లోడౌన్ ఉంది..
మార్కెట్లో స్లో డౌన్ కనిపిస్తోందని, జులైలో కొత్త స్టాక్ వచ్చే ముందు తమ ఇన్వెంటరీని వదిలించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయని లైఫ్ స్టైల్ సీఈఓ దేవరాజన్ అయ్యర్ పేర్కొన్నారు. మార్కెట్లో లిస్ట్ అయిన రిటైల్ కంపెనీల రెవెన్యూ ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 20–30 శాతం (కిందటి ఏడాదితో పోలిస్తే) పెరిగింది. తక్కువ ఆదాయ ప్రజలను టార్గెట్ చేసే వీ మార్ట్, పాంటలూన్స్ వంటివి కొంత ఒత్తిడిలో ఉన్నాయి. ప్రీమియం ప్రొడక్ట్లకు కూడా డిమాండ్ తగ్గుతోందని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ (ఏబీఎఫ్ఆర్ఎల్), జాకీ బ్రాండ్ ప్రొడక్ట్లు అమ్మే పేజ్ ఇండస్ట్రీస్ చెబుతున్నాయి. ప్రస్తుత క్వార్టర్లో తమ గ్రోత్ బాగా తగ్గిందని, అన్ని సెగ్మెంట్లలో ఈ పరిస్థితులే ఉన్నాయని ఏబీఎఫ్ఆర్ఎల్ ఎండీ ఆశిష్ దీక్షిత్ అన్నారు. ‘ఒక క్వార్టర్లో అన్ని సెగ్మెంట్లలో స్లోడౌన్ కనిపించడం ఇదే మొదటిసారి. తక్కువ ధరల సెగ్మెంట్లో స్లోడౌన్ ఉందని గతంలో చెప్పాను.
ప్రస్తుతం అన్ని సెగ్మెంట్లలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి’ అని వెల్లడించారు. సెగ్మెంట్ బట్టి డిస్కౌంట్స్ ఉన్నాయని మాల్స్ ఓనర్లు పేర్కొన్నారు. ఉదాహరణకు ఫుట్వేర్స్ వచ్చే నెల నుంచి బీఐఎస్ రూల్స్కు తగ్గట్టు ఉండాలి. దీంతో రిటైలర్లు తమ దగ్గర ఉన్న స్టాక్ను వేగంగా అమ్మేయాలని చూస్తున్నారు. రిటైలర్లు క్వాలిటీ కంట్రోల్ను మెరుగుపరచాలి. టెస్టింగ్ ల్యాబోరేటరీస్ను ఏర్పాటు చేసి, బీఐఎస్ లైసెన్స్ను వచ్చే నెల లోపు పొందాల్సి ఉంది. ఆన్లైన్ రిటైలర్లు ఇప్పటికే సేల్స్ ప్రారంభించాయని, వీటితో పోటీ పడేందుకు రిటైలర్లు కూడా డిస్కౌంట్లను ప్రకటించాల్సిందేనని ఢిల్లీ, పంజాబ్లలో మాల్స్ నిర్వహిస్తున్న యూనిటీ గ్రూప్ పేర్కొంది. కాగా, అమెజాన్ కిందటి నెల 4 న గ్రేట్ సమ్మర్ సేల్ను లాంచ్ చేయగా. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ను తాజాగా తీసుకొచ్చింది. ఈ నెల 14 వరకు ఇది కొనసాగుతుంది.