తెలంగాణతో ఉమ్మడి ప్రాజెక్టు వద్దు

తెలంగాణతో ఉమ్మడి ప్రాజెక్టు వద్దు

అమరావతి,  వెలుగు: తెలంగాణతో ఉమ్మడి ప్రాజెక్టుతో ఏపీకి నష్టం వాటిల్లుతుందని, ఈ ఆలోచనను విరమించుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ కోరింది. దీనికయ్యే ఖర్చుతో పోలవరం నుంచి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు గోదావరి మిగులు జలాలను తరలించవచ్చంది. ఆదివారం నవ్యాంధ్ర రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం సీఎంకు లేఖ రాసింది. గోదావరి మిగులు జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశంలోని నిర్ణయాలను లేఖలో పేర్కొంది. దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోసే ప్రతిపాదనతో ఏపీ భవిష్యత్తులో ఇబ్బంది పడుతుందన్నారు. ఉమ్మడి ప్రాజెక్టు ప్రతిపాదించిన మార్గంలో తెలంగాణలోని కరువు ప్రభావిత ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయని, వీటిని దాటుకుని నీళ్లు కిందకు రావడం కష్టమని చెప్పారు. ఏపీ, కర్నాటక ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్రలోనే వాటా నీళ్లు రావటం లేదన్నారు. తుంగభద్ర నుంచి ఏపీకి 32 టీఎంసీలు రావాల్సి ఉండగా 18 టీఎంసీలైనా రావడం లేదని, ఇదే పరిస్థితి ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులో రిపీట్ అవుతుందన్నారు. రెండు రాష్ర్టాల మధ్య గొడవలు జరగొచ్చని, ప్రభుత్వాలు మారితే పరిస్థితి తీవ్రమవుతుందని లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ కరువు ప్రాంతానికి నీరిచ్చే ప్రాజెక్టుకు విభజన హామీల పరంగా కేంద్రం సాయం అందుతుందని, రాయలసీమ వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులను ప్రాజెక్టుకు ఉపయోగించుకునే వీలుంటుందని చెప్పారు.

గోదావరి మిగులు జలాల తరలింపు ఇలా

వర్షాకాలంలో పోలవరం నుంచి 120 రోజులు 400 టీఎంసీలను ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. పోలవరం కాఫర్ డ్యాం నుంచి ప్రకాశం బ్యారేజీ ఎ గువకు ప్రత్యేకంగా కాలువ తవ్వాలి. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ ఎగువన ఆక్విడెక్ట్ ద్వారా కృష్ణాలో నీళ్లు కలపకుండా సాగర్ కుడి కాలువకు నీటిని తీసుకెళ్లాలి. అటు నుంచి 3 కాలువల ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రాజెక్టులకు నీరు తరలించాలి. వరదలొచ్చే 4 నెలల కాలంలో సోమశిల, వెలిగొండతోపాటు రాయలసీమలోని కీలక ప్రాజెక్టుల్లో వరదను స్టోర్ చేసుకోవచ్చు. నీటి వినియోగం పెరిగినా తగ్గినా ఏపీలోనే కాలువలు ఉండటం వల్ల ఇబ్బందులు ఉండవు. దీంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు.. కడప, చిత్తూరు జిల్లాల్లో మరో 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు సూచించారు.