శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో దారుణం జరిగింది. టెర్రరిస్టులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఓ మసీద్లో ప్రార్థన చేసుకుంటున్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ను కాల్చి చంపారు. మహ్మద్ షఫీ మీర్ రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్. ఆయన ఆదివారం ఉదయం స్థానిక మసీదులో ప్రార్థన చేస్తుండగా.. అక్కడికి చేరుకున్న కొందరు టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మహ్మద్ షఫీ అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
కాగా, పూంఛ్ జిల్లాలో జవాన్లను తరలిస్తున్న సైనిక వాహనాలపై పక్కా ప్రణాళికతో టెర్రరిస్టులు కాల్పులు జరిపిన రెండు రోజుల్లోనే.. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ను చంపడం ఆందోళన కలిగిస్తున్నది. రాజకీయ పార్టీలు ఈ ఘటనను ఖండించాయి. హింసను ఏ రూపంలోనూ సహించలేమని నేషనల్ కాన్ఫరెన్స్ పేర్కొంది. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘ఐదుగురు జవాన్లు మిలిటెంట్ల ఆకస్మిక దాడిలో వీరమరణం పొందారు.
ముగ్గురు అమాయక పౌరులు సైన్యం కస్టడీలో మరణించారు. ఇప్పుడు ఒక రిటైర్డ్ ఆఫీసర్ చనిపోయారు. ప్రభుత్వం చెప్పిన సాధారణ స్థితిని కొనసాగించడంలో అమాయకులు నష్టపోయారు” అని పేర్కొన్నారు. బీజేపీ ఈ చర్యను భయంకరమైనదిగా అభివర్ణించింది. ‘‘ ఆజాన్ను కూడా సహించని టెర్రరిస్టులు రిటైర్డ్ పోలీసు అధికారిని చంపారు. టెర్రరిజంకు, టెర్రరిస్టులకు మతం లేదు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు.