కేసీఆర్​పై రేవంత్​ పోటీ!

కేసీఆర్​పై రేవంత్​ పోటీ!
  •    ఈ నెల 8న కామారెడ్డిలో నామినేషన్​
  •     నిజామాబాద్​ అర్బన్ నుంచి షబ్బీర్​ అలీ
  •     9న అక్కడే భారీ బహిరంగ సభ  
  •     మైనారిటీ డిక్లరేషన్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి కామారెడ్డిలో  సీఎం కేసీఆర్ పై పోటీ చేయనున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు రేవంత్ కొడంగల్​తో పాటు కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డి స్థానం నుంచి కూడా బరిలోకి దిగనున్నారు. శనివారం గాంధీభవన్​లో నిజామాబాద్ ​జిల్లా నేతలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రటరీలు, పీసీసీ చీఫ్​రేవంత్, షబ్బీర్ అలీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కామారెడ్డి బరిలో రేవంత్​ ఉంటారని ఠాక్రే స్పష్టం చేసినట్టు తెలిసింది. 

ఏఐసీసీ ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 8న కామారెడ్డిలో రేవంత్​ నామినేషన్​ వేయనున్నట్టు తెలుస్తున్నది. శుక్రవారం కొడంగల్ లో తొలి సెట్​ నామినేషన్​ వేసిన రేవంత్​రెడ్డి.. సోమవారం రెండో సెట్​నామినేషన్​వేయనున్నారు. ఇక, రేవంత్​ కామారెడ్డి బరిలో ఉంటుండటంతో షబ్బీర్​అలీ నిజామాబాద్​ అర్బన్​ నుంచి బరిలోకి దిగనున్నారు. 

ఆదివారం షబ్బీర్​ అలీ ఆ నియోజకవర్గ నాయకులతో సమావేశం కానున్నారు. నామినేషన్​ఎప్పుడు వేసేదీ అప్పుడే తేల్చనున్నారు. షబ్బీర్​అలీ నామినేషన్​కు పీసీసీ చీఫ్​ రేవంత్ కూడా వెళ్తారని సమాచారం. మరోవైపు ఈ నెల 9న నిజామాబాద్​లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. అక్కడే మైనారిటీ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సల్మాన్ ​ఖుర్షీద్​ హాజరు కానున్నట్టు సమాచారం. 

నేడు థర్డ్​లిస్ట్​?

కాంగ్రెస్​పార్టీ మూడో లిస్ట్​ ఆదివారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. అన్ని స్థానాలకు సంబంధించిన వివరాలను ఇప్పటికే సెంట్రల్​ఎలక్షన్​ కమిటీకి అందజేసినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర నేతలతో ఒకసారి జూమ్​లో సమావేశమై చర్చించాక ఆదివారం మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్​ ఉన్నది. 

కామారెడ్డి, నిజామాబాద్​ అర్బన్​ స్థానాలు దాదాపు ఖరారైపోయిన నేపథ్యంలో.. మిగతా17 స్థానాలపైనే కాంగ్రెస్​ నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. సీపీఎం, సీపీఐ పొత్తులు ఎటూ తేలకపోవడం, సీపీఎం తాను పోటీ చేసే స్థానాలను ప్రకటించడంతో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్​ అభ్యర్థుల పేర్లే ప్రకటించే అవకాశం ఉంది.