హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని నియమిం చింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్అలీ, హర్కర వేణుగోపాల్ను ప్రభుత్వ సలహాదారులుగా, పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవిని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. అందరికీ కేబినెట్ హోదాతో పదవులను ఇచ్చింది. అయితే, వాళ్లు ఎంతకాలం ఈ పదవిలో కొనసాగుతారన్న విషయాన్ని మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. సీఎం రేవంత్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్రెడ్డికి సీఎం సలహాదారుగా అవకాశం దక్కింది. షబ్బీర్అలీని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు, హర్కర వేణుగోపాల్ను ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారులుగా ప్రభుత్వం నియమించింది.
రేవంత్ వెన్నంటే వేం నరేందర్
సీఎం రేవంత్రెడ్డికి వేం నరేందర్రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ఆశించినా దక్కలేదు. ఎమ్మెల్సీ రేసులోనూ నిలిచారు. అయితే పార్టీలో సీనియర్లు ఎక్కువ మంది ఉండటంతో అదీ దక్కలేదు. ఈ క్రమంలోనే ఆయనకు మంచి పదవి ఇస్తామంటూ పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. సీఎం రేవంత్కు సలహాదారుగా నియమిస్తూ కేబినెట్హోదానూ ఇచ్చారు. రేవంత్రెడ్డితో వేం నరేందర్రెడ్డిది దాదాపు17 ఏండ్ల అనుబంధం. ఇండిపెండెంట్ఎమ్మెల్సీగా రేవంత్ఎన్నికై ఆ తర్వాత టీడీపీలో చేరినప్పటి నుంచి అప్పటికి టీడీపీలో ఉన్న వేం నరేందర్రెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో వేంనరేందర్ ప్రాతినిధ్యం వహించిన మహబూబాబాద్ రిజర్వ్డ్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరారు. పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. అందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డికి సీఎం సలహాదారుగా ఇచ్చి మరింత దగ్గరుండేలా చూసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
షబ్బీర్ అలీకీ చాన్స్
షబ్బీర్ అలీ సీనియారిటీ, పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సలహాదారుగా అవకాశం దక్కింది. ఎమ్మెల్సీ, ఎంపీ సీటు కోసం రేసులో ఉన్న ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందన్న చర్చలు జరిగినా.. చివరకు కేబినెట్ హోదాతో షబ్బీర్ అలీని ప్రభుత్వం సలహాదారుగా అవకాశం కల్పించింది. ఇక, ఎమ్మెల్సీగా అవకాశం కోసం ఎదురు చూసిన హర్కర వేణుగోపాల్కూ సలహాదారు పదవి దక్కింది. ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేసిన మల్లు రవికి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ హోదాతో పదవి ఇచ్చింది. నలుగురికి కీలక పదవులివ్వడం ద్వారా సీనియర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదే సమయంలో ఎమ్మెల్సీ, ఎంపీలకు పోటీలో ఉన్న మరికొందరు సీనియర్లీడర్లకూ లైన్క్లియర్చేసినట్టయింది. ఎమ్మెల్సీ పదవులకు ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉన్నది. ఎంపీ స్థానాలకూ కొన్ని చోట్ల పోటీ ఉంది.
నామినేటెడ్ పోస్టులు కొలిక్కి!
లోక్సభ ఎన్నికలు వచ్చేలోపు పార్టీ కోసం పనిచేసిన నేతలకు పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. చాలా మంది నేతలు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు కూడా. ఈ క్రమంలోనే పోస్టుల భర్తీని వేగవంతం చేసినట్టుగా ఇటు పార్టీ, అటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే నలుగురు పార్టీ సీనియర్లను ప్రభుత్వ సలహాదారులుగా నియమించినట్టు చెప్తున్నారు. నామినేటెడ్ పోస్టులూ ఓ కొలిక్కి వచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. టీఎస్ఐఐసీ, ఆర్టీసీ చైర్మన్పోస్టుల భర్తీని అతి త్వరలోనే చేపట్టే అవకాశమున్నట్టు సమాచారం. కార్పొరేషన్ చైర్పర్సన్లను ఈ నెలాఖరులోపు నియమించే అవకాశాలున్నట్టు చెప్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి లండన్టూర్ముగించుకుని వచ్చాక వాటిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. తొలి విడతలో భాగంగా15 నుంచి 20 మందికి చైర్మన్లుగా అవకాశం కల్పించొచ్చని సమాచారం.