
అమెరికాలో ఉన్న తన కొడుకు హిమాన్షును మిస్సవుతున్నానంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీ కొడుకు గుర్తుకు వచ్చి గుండె బరువెక్కుతుందా కేటీఆర్..కొన్ని రోజులకే తల్లడిల్లి పోతున్నావ్..మరి లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదా..? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్..కొడుకుతో కొద్ది రోజల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా..
ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని.., లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా?
సర్కారు హాస్టళ్లలో మీరు పెట్టే తిండి తినలేక ఏడుస్తున్నారని తెలిసి అమ్మా నాన్నలు పడే ఆవేదన నీలా కాదనుకున్నావా?
కొడుకు తిరిగిరాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా?
మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన 30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన.. నీలా కాదనుకున్నావా?
తిండిపెట్టక చిన్నారులని ఏడిపించి,ఫీజు బకాయిలివ్వక యువతని గోసపెట్టి, ఉద్యోగాలివ్వక నిరుద్యోగులని వంచించిన మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుంది..అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.
ALSO READ : కాంగ్రెస్కు అవకాశం ఇస్తే పాతాళంలోకి పోతాం : హరీష్ రావు