హైదరాబాద్, వెలుగు : తమ పార్టీలో చేరికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తున్నది. పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల, ఆయన కుమారుడు రాజేశ్ను రేవంత్ తీసుకుని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ అయినట్లు సమాచారం. అనంతరం పార్టీ హైకమాండ్తో డీకే శివకుమార్, రేవంత్ చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతున్నది. మరో రెండు రోజుల్లో పొంగులేటి, జూపల్లి, దామోదర్రెడ్డి మీడియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం.
కోమటిరెడ్డితో జూపల్లి సమావేశం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లో కోమటిరెడ్డి ఇంట్లో ఈ భేటీ జరిగింది. అనంతరం జూపల్లి, కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డితో జస్ట్ మర్యాదపూర్వకమైన టీ భేటీ మాత్రమేనని జూపల్లి చెప్పారు. ఏ పార్టీలో చేరుతానన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. జూపల్లి, తాను పాత మిత్రులమని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్లోకి వస్తే మంచిదని ఆయనకు చెప్పానన్నారు. షర్మిల కూడా కాంగ్రెస్లో చేరితే మంచిదే అని పేర్కొన్నారు. నల్గొండలో ఈ నెల18 లేదా 19న ప్రియాంకా గాంధీ సభ ఉంటుందని ఆయన తెలిపారు. ఆ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో తెలుస్తుందన్నారు.