రాష్ట్ర ముఖ్యనేతల విదేశీ బాట..సీఎం రేవంత్ రెడ్డి లండన్, అమెరికా పర్యటన

రాష్ట్ర ముఖ్యనేతల విదేశీ బాట..సీఎం రేవంత్ రెడ్డి లండన్, అమెరికా పర్యటన
  • ప్రతిష్టాత్మక యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశాలు
  • ఫ్యూచర్​ సిటీలో క్యాంపస్​ల ఏర్పాటుపై చర్చ
  • కూతురు కాలేజీ అడ్మిషన్​ కోసం అమెరికాకు వెళ్లిన కేటీఆర్​
  • అక్బరుద్దీన్​ బిడ్డ పెండ్లికి లండన్​ పోయిన హరీశ్​ రావు 

హైదరాబాద్, వెలుగు: రాజకీయాల్లో నిత్యం వార్తల్లో నిలిచే అధికార, ప్రతిపక్షాల అగ్రనేతలంతా ఒక్కసారిగా విదేశీ బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్  కీలక నేతలు కేటీఆర్, హరీశ్​ రావు వేర్వేరు కారణాలతో విదేశీ పర్యటనలకు వెళ్లారు. అధికారిక, వ్యక్తిగత పనుల కోసం ముఖ్యనేతలంతా ఒకే సమయంలో  విదేశాలకు వెళ్లడంతో రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు కాస్త చల్లబడ్డాయి. రాష్ట్రంలో విద్యావ్యవస్థను చక్కదిద్ది పటిష్టపరచాలనే లక్ష్యంతో సీఎం రేవంత్​ రెడ్డి లండన్​, అమెరికా పర్యటనకు వెళ్లారు. అటు అధికారిక పర్యటనలతోపాటు ఇటు పార్టీ కార్యకలాపాల్లోనూ పాల్గొననున్నారు.

ఆయా దేశాల్లోని ప్రతిష్టాత్మక  ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్​ లండన్​, లండన్​ బిజినెస్​ స్కూల్, అమెరికాలోని హార్వర్డ్​ యూనివర్సిటీ, మసాచుసెట్స్​ ఇనిస్టిట్యూట్​ఆఫ్​ టెక్నాలజీ, నార్త్​ ఈస్టర్న్​ క్యాంపస్​, వర్జీనియా టెక్​ యూనివర్సిటీలను సీఎం సందర్శించనున్నారు. అక్కడి అధికారులతో సమావేశమై.. హైదరాబాద్​లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్​ సిటీలో యూనివర్సిటీ బ్రాంచ్​లను ఏర్పాటు చేయాలని కోరనున్నారు. తద్వారా రాష్ట్రంలో ఉన్నత చదువులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు మార్గం వేయనున్నారు. యూనివర్సిటీల పర్యటనల తర్వాత అమెరికాలో కాంగ్రెస్​ ఓవర్సీస్​ బృందం ఏర్పాటు చేసిన సమావేశాల్లో సీఎం పాల్గొననున్నారు. 

కూతురు చదువుల కోసం..

బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్​ కూడా15 రోజులపాటు కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. తన కూతురు ఉన్నత చదువుల కోసం కాలేజీ అడ్మిషన్ కు​ ఆయన వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వర్జీనియా టెక్​యూనివర్సిటీలో సీటు రావడంతో కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లినట్టు తెలిసింది. దీంతోపాటు పార్టీ ఓవర్సీస్​ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని సమాచారం. దీంతో ఆయన కూడా ఈ నెలాఖరుదాకా అక్కడే ఉండే అవకాశాలున్నాయి.

అక్బరుద్దీన్​ కూతురు పెండ్లి కోసం..

ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్​ ఒవైసీ తన కూతురు పెండ్లి లండన్​లో చేస్తున్నారు. దీంతో ఎంఐఎం నేతలతోపాటు పలువురు అధికార ప్రతిపక్ష నేతలు లండన్​కు వెళ్లారు. హరీశ్​ రావు బుధవారం రాత్రే లండన్​ వెళ్లారు. అక్కడ పెండ్లికి అటెండ్​ అయ్యి.. శుక్రవారం రాత్రికి లండన్​ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. మంత్రి అజారుద్దీన్​ కూడా అక్బరుద్దీన్​ బిడ్డ పెండ్లి కోసం లండన్​ వెళ్లారు. ఇటు అధికార, ప్రతిపక్షాల నేతలు ఒకేసారి విదే శీ పర్యటనలకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.