జూన్ 3 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు..రైతులందరూ హాజరుకావాలి : బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ 

జూన్ 3 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు..రైతులందరూ హాజరుకావాలి : బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ 

బెల్లంపల్లి, వెలుగు:  జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు బెల్లంపల్లి డివిజన్‌కు చెందిన అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆర్డీవో హరికృష్ణ తెలిపారు. గురువారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ల ఆధ్వర్యంలో జరిగే సదస్సుల్లో రైతుల భూ సమస్యలు, దరఖాస్తులను స్వయంగా స్వీకరించనున్నట్లు చెప్పారు.

వాటిని ఆన్​లైన్‌లో నమోదు చేసి ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామాలు పరిష్కరించేందుకు, 2014 జూన్ 2కు ముందు భూమిని కొనుగోలు చేసి, 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 వరకు ఆన్​లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారి అభ్యర్థనలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. భూ సరిహద్దు, విస్తీర్ణ మార్పులు, పేర్ల సవరణలు చేయించుకునేందుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైతులందరూ ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.