- స్పష్టం చేసిన రెవెన్యూ సెక్రటరీ
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు మొదటి నుంచీ 28 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. జీఎస్టీ కౌన్సిల్ 52వ మీటింగ్ సందర్భంగా ఢిల్లీ, గోవా వంటి రాష్ట్రాలు రెట్రాస్పెక్టివ్ పన్ను విధింపుపై అభ్యంతరాలు లేవనెత్తాయి. దీనిపై రెవెన్యూ సెక్రటరీ పైవిధంగా క్లారిటీ ఇచ్చారు. ‘ఇది రెట్రాస్పెక్టివ్ విధింపు కాదు. అప్పటికే ఉన్న రూల్’ అని ఆయన పేర్కొన్నారు. డబ్బుతో బెట్వేసి ఆడే ఆన్లైన్ గేమ్స్పై ఎప్పటి నుంచో 28 శాతం జీఎస్టీ అమలులో ఉందని వివరించారు.
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కిందకి వచ్చే వాటిపై 28 శాతం జీఎస్టీ అమలు చేయాలనే రూల్స్ పేర్కొంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. గత ఆరేళ్ల కాలానికి 28 శాతం చొప్పున లెక్కించి జీఎస్టీ చెల్లించాలని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను కోరడం కరెక్ట్ కాదని ఢిల్లీ ఫైనాన్స్ మినిస్టర్ అతిషి ప్రస్తావించారు. అక్టోబర్ 1 నుంచే 28 శాతం జీఎస్టీ అమలులోకి తెచ్చిన కారణంగా, అంతకు ముందు కాలానికీ అదే రేటు చెల్లించాలనడం సరైనది కాదని పేర్కొన్నారు.
డీజీజీఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుందని, ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోలేమని, డీజీజీఐ ఏదైనా క్లారిఫికేషన్ కోరితే ఇస్తామని జీఎస్టీ కౌన్సిల్ పేర్కొంది.