నేషనల్ వ్యాక్సినేషన్ గైడ్‌లైన్స్ విడుదల

నేషనల్ వ్యాక్సినేషన్ గైడ్‌లైన్స్ విడుదల
  • కంపెనీల నుంచి 75 శాతం వ్యాక్సిన్లు కొంటాం
  • ప్రైవేట్ ఆస్పత్రులలో టీకా సర్వీస్ ఛార్జ్ రూ. 150 మించకూడదు
  • రాష్ట్రాలకు ఉచితంగా టీకాల సరఫరా
  • వ్యాక్సిన్లు వేస్ట్ చేస్తే.. కేటాయింపు తగ్గుతుంది

జాతీయ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలకు ఉచితంగా టీకా సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి నూతన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ప్రభుత్వ కేంద్రాల ద్వారా ఉచితంగా టీకాలు అందజేయాలని వెల్లడించింది. 18 ఏళ్ళు పైబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాళ వద్దా అనే విషయంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. వైరస్ తీవ్రత, జనాభా, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా రాష్ట్రాలకు టీకాలు కేటాయించాలని నిర్ణయించారు. వ్యాక్సిన్ వేస్టేజ్ ప్రభావం.. కేటాయింపులపై ఉంటుందని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ల సరఫరాపై ఆయా రాష్ట్రాలకు ముందే సమాచారం అందిస్తామని కేంద్రం తెలిపింది. జిల్లా, టీకా కేంద్రాల స్థాయిలో వ్యాక్సిన్ లభ్యత సమాచారం పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని స్పష్టంచేసింది. టీకా తయారీదారుల నుంచి నెలవారీ ఉత్పత్తిలో 75శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించింది. మిగతా 25 టీకాలు ప్రైవేటు ఆస్పత్రిలకు ఇవ్వొచ్చని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులు టీకాల కోసం సర్వీస్ ఛార్జ్ రూ.150లకు మించకూడదు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై నిఘా ఉంచాలని కోరింది. పౌరులందరూ వారి ఆదాయ స్థితితో సంబంధం లేకుండా ఉచిత టీకాలకు అర్హులని తెలిపింది. కో-విన్ ప్లాట్‌ఫాం ప్రతి పౌరుడికి టీకాల బుకింగ్‌ను సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రీ-బుకింగ్ చేసే సదుపాయాన్ని అందిస్తుందని కేంద్రం వ్యాఖ్యానించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ టీకా కేంద్రాలు ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తాయని తెలిపింది. ఈ కొత్త గైడ్‌లైన్స్ 21వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.