Rinku Singh: డబ్బు విలువ తెలుసు.. రూ.55 లక్షలు నాకు ఎక్కువే: ఐపీఎల్ శాలరీ‌పై రింకూ సింగ్

Rinku Singh: డబ్బు విలువ తెలుసు.. రూ.55 లక్షలు నాకు ఎక్కువే: ఐపీఎల్ శాలరీ‌పై రింకూ సింగ్

2023 ఐపీఎల్ సీజన్ లో రింకూ సింగ్ ఒక్కసారిగా స్టార్ ఆటగాడి లిస్టులోకి చేరాడు. ఏప్రిల్ 09, 2023న (ఆదివారం) గుజరాత్‌ టైటాన్స్‌పై  జరిగిన మ్యాచ్ లో రింకూ సృష్టించిన విధ్వంసం అలాంటింది.  ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి కోల్‌కతా జట్టును గెలిపించి ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయాడు. ఈ ప్రదర్శనతో అనూహ్యంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి తనకు తాను నిరూపించుకున్నాడు. నిలకడాగా ఆడుతూనే వేగంగా పరుగులు చేస్తూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. 

స్టార్ ఆటగాళ్లతో సమానంగా ఆడుతున్న రింకూ ఐపీఎల్ శాలరీ కేవలం 55 లక్షలు. అనామక ప్లేయర్లు కోట్లు కొల్లగొడుతుంటే ఇతనికి మాత్రం కనీసం కోటి కూడా దక్కట్లేదు. అయితే తనకు వచ్చే శాలరీపై రింకూ సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఐపీఎల్ నుంచి వచ్చే  జీతం తనకు సరిపోతుందని చెప్పాడు.

"ఐపీఎల్ లో నాకు 55 లక్షల రూపాయలు వస్తున్నాయి. నాకు ఇది చాలా ఎక్కువ. దేవుడు నాకు ఏది ఇచ్చినా సంతోషిస్తా. ఇది నా ఆలోచన. నాకు ఎక్కువ డబ్బు రావాలని అస్సలు అనుకోను. 55 లక్షల రూపాయలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. డబ్బు లేనప్పుడు నేను డబ్బు విలువను గ్రహించాను." అని రింకు సింగ్ దైనిక్ జాగరన్‌తో చెప్పుకొచ్చాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్ లో రింకూ నిరాశపరిచాడు. 11 ఇన్నింగ్స్ ల్లో కేవలం 168 పరుగులు మాత్రమే చేశాడు. 

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన  రింకు సింగ్‌ యూపీ తరఫున 2014లో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. 2017లో తొలిసారి 19 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లోని పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ ఆ మ్యాచ్ లో అతనికి ఆడే అవకాశం దక్కలేదు. మరుసటి ఏడాది జరిగిన వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు రూ. 80 లక్షలకు రింకును సొంతం చేసుకుంది. 

2018లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున రింకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గత ఐదేళ్ల పాటు అదే టీమ్ తరుపున ఆడుతూ వస్తున్నాడు. 20222 ఐపీఎల్ లోగాయం కారణంగా అతను ఆడలేకపోయాడు. 2023 ఐపీఎల్ కు ముందు జరిగిన వేలంలో 55 లక్షలకు కొనుగోలు చేసి తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయక కోచ్‌ అభిషేక్ నాయర్‌ మార్గదర్శకంలో రింకు సింగ్‌ రాటుదేలాడు.