అగ్నిపథ్ ఆర్ఎస్ఎస్ అజెండానా..? : తేజస్వీ యాదవ్

అగ్నిపథ్ ఆర్ఎస్ఎస్ అజెండానా..?  : తేజస్వీ యాదవ్

అగ్నిపథ్ పథకంపై యువతకు చాలా సందేహాలు ఉన్నాయని, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. ‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ బీహార్ లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. చదువుకున్న యువతకు అగ్నిపథ్ విధానం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ వంటిదా..? లేక ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగంగా దీన్ని తీసుకొచ్చారా..? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. యువత శాంతియుతంగా తమ నిరసనలను తెలియజేయాలని పిలుపునిచ్చారు. 

‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ గురించి మాట్లాడిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ‘నో ర్యాంక్, నో పెన్షన్’ ను అమల్లోకి తీసుకొస్తోందని తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. అగ్నిపథ్ ను సైన్యంలోని ఉన్నతాధికారుల నియామకాలకు ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. మరోవైపు బీహార్ లో చెలరేగిన హింసకు ఆర్జేడీ పార్టీయే కారణమన్న బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.