కామారెడ్డి హైవేపై దారి దోపిడీ..తల్లి, కొడుకుపై దాడి , బంగారం దోచుకుని పరార్

కామారెడ్డి హైవేపై దారి దోపిడీ..తల్లి, కొడుకుపై దాడి , బంగారం దోచుకుని పరార్

పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండలం హైవే సర్వీస్​ రోడ్డుపై శనివారం బైక్​పై వెళ్తున్న తల్లి, కొడుకుపై దాడి చేసి, బంగారాన్ని దోచుకొని పరారయ్యారు. ఈ ఘటనలో తల్లీకొడుకుకు గాయాలవగా స్థానికులు వారిని మద్నూర్​ హాస్పిటల్​కు తరలించారు. 

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్​ గ్రామానికి చెందిన మల్లయ్యగారి ఎల్లాగౌడ్, అతని తల్లి సత్తెమ్మ బైక్​పై మద్నూర్​లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తున్నారు. సర్వీస్​ రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకుని బైక్ ను అటకాయించి కత్తులతో దాడి చేసి, ఏడు తులాల బంగారం ఆభరణాలు దోచుకున్నారని తెలిపారు. బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్​ ఎస్సై విజయ్​కొండ బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండుగులను గాలించేందుకు మహారాష్ట్రలోని దెగ్లూర్​కు టీమ్​ను పంపినట్లు వారు తెలిపారు.