
దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఏటీఎంలు టార్గెట్ గా చేసుకున్న దొంగలు ఇపుడు ఏకంగా బ్యాంకులకే కన్నం పెడుతున్నారు. పక్కా ప్లాన్ తో బ్యాంకుల్లో రాబరీ చేస్తున్నారు. లేటెస్ట్ గా మెదక్ జిల్లా వెల్దుర్తిలో దొంగలు బీభత్సం సృష్టించారు.
అర్థరాత్రి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ గోడకు కన్నం వేసి చోరీకి యత్నించారు. లోపలోకి ప్రవేశించిన దొంగలు స్టోర్ రూమ్ వెనుక నుంచి తాళాలు పగలగొట్టారు. లాకర్స్ రూమ్ దగ్గరికి వెళ్ళగానే అలారం మోగడంతో పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇటీవల బ్యాంకు చోరీ ఘటనలు పెరిగిపోతున్నాయి. జూన్ 2న రాత్రి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు SBI బ్యాంక్ కు కన్నం వేయాలని కొందరు దుండగులు ప్రయత్నించారు. బ్యాంక్ బిల్డింగ్ కిటికిలకు ఉన్న గ్రిల్స్ తొలగించి దొంగలు బ్యాంక్ లోపలికి ప్రవేశించారు. ఏకంగా వెల్డింగ్ గ్యాస్ కట్టర్ తో బ్యాంక్ లాకర్ ను తెరవడానికి ప్రయాత్నించారు. ఎంత ట్రై చేసినా లాకర్ ఓపెన్ కాకపోవడంతో దుండగులు అక్కడని నుంచి తప్పించుకొని వెళ్లారు. బ్యాంక్ సిబ్బంది KPHB పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.