రోహిత్ టుక్ టుక్ బ్యాటింగ్ మానేయ్.. దూకుడు పెంచు: కపిల్ దేవ్

రోహిత్ టుక్ టుక్ బ్యాటింగ్ మానేయ్.. దూకుడు పెంచు: కపిల్ దేవ్

టీమిండియా మాజీ దిగ్గజం, 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఇంగ్లండ్ క్రికెట్ జట్టుపై పొగడ్తలు కురిపించిన ఈ ఫైర్ బ్రాండ్.. భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు పలు సూచనలు చేశారు.

బజ్‌బాల్‌పై ప్రశంసలు

కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టాక ఇంగ్లండ్ జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. బజ్‌బాల్ అనే పేరుతో టెస్ట్ మ్యాచ్‍ను టీ20తరహాలో ఆడేస్తున్నారు. మూడు రోజుల్లోనే ఫలితం వచ్చేలా ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ ఆట తీరు తనకెంతో నచ్చిందని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు. 

"బజ్‌బాల్ క్రికెట్ అద్భుతం. ఇటీవలి కాలంలో నేను చూసిన అత్యుత్తమ సిరీస్‌లలో యాషెస్ ఒకటి. టెస్ట్ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ అల్ట్రా-ఎటాకింగ్ క్రికెట్ ఆడుతోంది. అది వారికి బాగా కలిసొస్తోంది. వారు అదే ఆటతో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లపై అధ్బుత విజయాలు అందుకున్నారు. 2023 యాషెస్‌ సిరీస్ ను డ్రా చేయగలిగారు. క్రికెట్ ఆడే అన్ని దేశాలు ఆ దిశగానే ఆలోచించాలి. ప్రతి జట్టు ఫలితాల కోసం ప్రయత్నించాలి. ఫార్మాట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు కృషి చేయాలి.." అని కపిల్ దేవ్ తెలిపారు.

రోహిత్.. దూకుడు పెంచాలి

ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ, ఆటతీరుపై స్పందించిన కపిల్ దేవ్.. రోహిత్ చాలా మంచోడని కాకపోతే కాస్త దూకుడు అలవరచుకోవాలని సూచించారు. "రోహిత్ చాలా మంచివాడు. కానీ అతను మరింత దూకుడుగా ఉండాలి. ఇంగ్లండ్ క్రికెటర్ల తరహాలో రోహిత్‌ కూడా అదే విధానాన్ని అవలంబిస్తే బాగుంటుంది.." అని ఈ మాజీ ఆల్ రౌండర్ ఓ జాతీయ  ఛానల్‌తో చెప్పుకొచ్చారు.

కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రోహిత్ డిఫెన్సివ్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.