హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ల మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉందని గవర్నర్ తమిళి సై అన్నారు. పలువురు ప్రముఖ బెంగాలీలకు తెలంగాణతో వీడదీయరాని అనుబంధం ఉందన్నారు. రాష్ర్టంలో 8లక్షల మంది బెంగాలీ ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. మంగళవారం రాజ్ భవన్ లో పశ్చిమ బెంగాల్ ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ వర్చువల్గా మాట్లాడారు. అఘోరినాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజ్ మొదటి ప్రిన్సిపల్ గా పనిచేశారని, హరీంద్రనాధ్ చటోపాధ్యాయ, సరోజినినాయుడు ఆయన పిల్లలని గవర్నర్ గుర్తు చేశారు.
ప్రస్తుతం అబిడ్స్లో ఉన్న సరోజినినాయుడు ఇల్లు గోల్డెన్ త్రిషోల్డ్హెచ్సీయూకి విరాళం ఇచ్చినట్లు గవర్నర్ తెలిపారు. నిజాం రూల్ నుంచి హైదరాబాద్ రాష్ర్ట ఏర్పాటులో ఆపరేషన్ పోలో మిలిటరీ కమాండర్ జయంతోనాథ్ చౌదరి కీలక పాత్ర పోషించారన్నారు. శారద ముఖర్జీ ఉమ్మడి ఏపీ గవర్నర్ గా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ర్టంలో నివసిస్తున్న పలువురు బెంగాలీ ప్రముఖలు పాల్గొన్నారు.
యోగా డే గ్రీటింగ్స్
బుధవారం అంతర్జాతీయ యోగా డే సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. మోడీ ప్రధాని అయ్యాక ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఎంతో ప్రాధాన్యం పెరగిందన్నారు. మానసికంగా, శారీరకంగా మనిషి ఫిట్ గా ఉండటానికి, ఒత్తిడి, ఆందోళనలు తగ్గించటానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రధాని యోగా డే కార్యక్రమంలో పాల్గొంటున్నారని వెల్లడించారు. ‘వసుధైక కుటుంబానికి యోగా’ అనే థీమ్ను ఖరారు చేశారని గవర్నర్ తెలిపారు.