నచ్చిన వాళ్లను సెలెక్ట్ చేసుకోవడం.. వాళ్లపై తమ ఇంట్రెస్ట్ను చూపిస్తూ రిక్వెస్ట్లు పంపడం.. వాళ్లకూ నచ్చితే రొమాన్స్ చేసేయడం.. ఇదీ డేటింగ్ యాప్లలో ఇప్పుడు జరుగుతున్నది. కానీ, ఆ రొమాన్స్ పేరిట ఓ పెద్ద స్కామే జరుగుతోందన్న సంగతి తెలుసా? డేటింగ్ యాప్ల మాటున సైబర్ కేటుగాళ్లు ఉచ్చు బిగిస్తున్నారన్న విషయం తెలుసా? చాలా మందికి తెలిసుండదు. అలాంటి ఓ పెద్ద ముఠా గుట్టును రట్టు చేశారు అమెరికా ఫెడరల్ అధికారులు. ఒక్కరా.. ఇద్దరా.. ప్రపంచ వ్యాప్తంగా రొమాన్స్ పేరిట బుట్టలో వేసుకుని మోసం చేసిన 80 మందిని లాస్ఏంజిలిస్లో అరెస్ట్ చేశారు అమెరికా ఫెడరల్ అధికారులు. వాళ్ల చేతిలో 2018లో ఒక్క అమెరికాలోనే 21 వేల మంది మోసపోయారు. ఆ మోసం విలువ అక్షరాలా 14.3 కోట్ల డాలర్లు (సుమారు 1025 కోట్ల రూపాయలు). ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చెబుతున్న మాటిది. 2015 నుంచి పోలిస్తే ఈ మోసాలు నాలుగు రెట్లయ్యాయి. ‘‘డేటింగ్ యాప్ల పేరిట మోసగాళ్లు పెద్ద వలనే పన్నుతున్నారు. అంతేకాదు, డేటింగ్ ఉండని మామూలు సోషల్ మీడియా ద్వారా కూడా ఉచ్చు బిగిస్తున్నారు. ఒక్క ఫేస్బుక్ మెసేజ్తో స్కామ్ మొదలైపోతోంది. ఇలా ఒకరిద్దరు కాదు.. వేలాది మంది బాధితులుగా మిగిలిపోతున్నారు. జేబులు గుల్ల చేసుకుంటున్నారు” అని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ హెచ్చరించింది. ఒకవేళ అలాంటి కేటుగాళ్లు డేటింగ్ యాప్లు, లేదా సోషల్ మీడియాల్లో మెసేజ్లు పంపి, డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్లని మోసగాళ్లుగా గుర్తించాలని చెప్పింది.