ఢిల్లీలో భారత్​ జాగృతి రౌండ్​ టేబుల్​ సమావేశం

ఢిల్లీలో భారత్​ జాగృతి రౌండ్​ టేబుల్​ సమావేశం

హైదరాబాద్​, వెలుగు: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్​ బిల్లును పెట్టాలన్న డిమాండ్​తో ఢిల్లీలో భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. బుధవారం లే మెరీడియన్​ హోటల్​లో నిర్వహించిన ఈ చర్చావేదికలో 13 రాజకీయ పార్టీల ఎంపీలు, నేతలు, ప్రజా, మహిళా సంఘాల లీడర్లు  పాల్గొన్నారు. ఓటు వేసేందుకు మహిళలకు సమాన హక్కులను కల్పించినప్పుడు.. చట్టసభల్లో మాత్రం మహిళలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వరని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్​ బిల్లుకు మద్దతిస్తున్నామని ఆర్జేడీ ఎంపీ మనోజ్​ ఝా అన్నారు. మహిళా రిజర్వేషన్​ బిల్లుకు పితృస్వామ్య వ్యవస్థలు అడ్డొస్తున్నాయని సీపీఐ ఎంపీ బినోయ్​ బిశ్వం అన్నారు. రిజర్వేషన్లపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆర్​ఎల్డీ మహిళా విభాగం నేత ప్రతిభా సింగ్​, ఆ పార్టీ నేత భూపేంద్ర చౌదరి అన్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడం బాగాలేదని జేఎంఎం ఎంపీ మౌహా మాఝి అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, కాబట్టి, మహిళా రిజర్వేషన్​ బిల్లును తెచ్చేందుకు దానిని ఉపయోగించాలని ఆప్​ ఎంపీ రాఘవ్​ చద్దా పేర్కొన్నారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి అని డీఎంకే ఎంపీ తమిళిసై తంగపాండ్యన్​ అన్నారు. 

మహిళలకు సమాన స్థానం ఉండాలి: కవిత

రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులను కల్పించారు కానీ, అవి అమలు కావట్లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రౌండ్​ టేబుల్​ సమావేశానికి ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. నేల, నింగిలో మహిళలు సగమని చెప్తున్నా.. సమాన అవకాశాలు మాత్రం రావడం లేదన్నారు.