
సిద్దిపేట జిల్లా: రౌడీ షీటర్ ను దారుణంగా చంపిన ఘటన గురువారం రాత్రి సిద్దిపేట జిల్లాలో జరిగింది. కొంత కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో ఆయన్ని వేట కొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపారు. మెడపై నరకడంతో శరీర భాగం నుంచి తల వేరైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుని స్వగ్రామం సిద్ధిపేట మండలం ఇమాంబాద్ అని పోలీసులు తెలిపారు. పాత కక్షనే ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
దొంగనోట్ల కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడన్నారు. అంతేకాకుండా ఎల్లంగౌడ్ పలు కేసుల్లో ప్రధాన నిందుతుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని.. గతంలో శామీర్ పేట దగ్గర పోలీసులపై కాల్పులు జరిపి కానిస్టేబుల్ను హత్య చేసిన కేసులో ఎల్లంగౌడ్ ప్రధాన నిందితుడిగా గుర్తించబడ్డాడని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఇతనిపై పలు కేసులున్నట్లు సమాచారమన్నారు. అయితే ఇతన్ని హత్య చేసేందుకు శత్రువులు ఇప్పటికే పలుసార్లు ప్రయత్నించారని, కానీ దాడి నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడని స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. ఈ క్రమంలోనే గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మాటు వేసి ఎల్లంగౌడ్ ను హత్య చేసి ఉంటారని తెలిపారు పోలీసులు.