
కరోనాతో నోటిఫికేషన్లు లేక నిరాశలో ఉన్న నిరుద్యోగులకు ఐబీపీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల్లో ఆఫీసర్ స్కేల్–1,2,3 తో పాటు ఆఫీస్ అసిస్టెంట్ కొలువులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 10,447 ఉద్యోగాలను డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. పోస్టులు, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ ప్లాన్ ఈ వారం..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్ ప్రాసెస్ ద్వారా ఆఫీసర్ స్కేల్–1,2,3, ఆఫీసర్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 10,447 పోస్టులు ఉండగా తెలంగాణలో 407 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, 89 స్కేల్–1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు: ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, లోకల్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. స్కేల్–1,2,3 పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును బట్టి ఏదైనా బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో అనుభవం తప్పనిసరి. ఆఫీసర్ పోస్టును బట్టి వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్ స్కేల్–1 పోస్టులకు అప్లై చేసుకున్న వారు ఆన్లైన్లో ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపరీక్షలు నిర్వహిస్తారు.స్కేల్–1 పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. స్కేల్–2,3 పోస్టులకు ఒకే రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ పరీక్షను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్ని భాషల్లో రాసుకోవచ్చు. తెలంగాణ అభ్యర్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్తో పాటు ఉర్దూలో కూడా పరీక్ష రాసే సౌకర్యం కల్పించారు.
ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్–1 పోస్టులకు మాత్రమే ఉంటుంది. రెండింట్లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో విభాగానికి 40 మార్కుల చొప్పున 80 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో ప్రశ్నపత్రం ఉంటుంది. మెయిన్స్లో అదనంగా కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఆవేర్నెస్, లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. మెయిన్స్ 200 మార్కులకు ఉంటుంది. ఆఫీసర్ స్కేల్–3 పోస్టులకు సింగిల్ లెవెల్ పరీక్ష ఉంటుంది. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ప్రిపరేషన్ ప్లాన్
అభ్యర్థులు ప్రిపరేషన్ను విడివిడిగా కాకుండా ప్రిలిమ్స్, మెయిన్స్ దృష్టిలో ఉంచుకొని కొనసాగించాలి. అన్ని టాపిక్స్ చదివి సమయం వృథా చేయకుండా సిలబస్లోని అంశాలపైనే ఫోకస్ చేయాలి. ప్రిపరేషన్ ముగిసిన వెంటనే మాక్టెస్టులు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. దీంతో ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలుసుకోవచ్చు. టైం పెట్టుకొని మోడల్ పేపర్స్ రాస్తుంటే పరీక్ష హాల్లో నిర్ణీత సమయంలో ఎగ్జామ్ పూర్తి చేయవచ్చు. ప్రతి సబ్జెక్టుకు సరైన సమయం కేటాయించుకొని, క్లిష్టమైన టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రతిరోజు న్యూస్ పేపర్స్ చదవడం ద్వారా కరెంట్ ఎఫైర్స్పై పట్టు సాధించవచ్చు.
నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.175, చివరితేది: 28 జూన్ 2021, ప్రిలిమ్స్ ఎగ్జామ్: ఆగస్టు, మెయిన్స్: సెప్టెంబర్/ అక్టోబర్, ఇంటర్వ్యూ: అక్టోబర్/ నవంబర్, వెబ్సైట్: www.ibps.in