న్యూఢిల్లీ: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రూరల్ ఏరియాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచే ఉద్దేశంతో కేంద్రం లక్ష కోట్లతో ‘అగ్రి ఇన్ఫ్రా ఫండ్’ ఏర్పాటు చేయనుంది. పదేళ్ల పాటు(2029 వరకు) ఈ ఫండ్ అమలులో ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బూస్టప్ చేయడానికి, ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ ఫండ్ తోడ్పడుతుందన్నారు. ఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఈ ఫండ్ నుంచి సబ్సిడీతో లోన్లు అందజేస్తామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, రైతు సంఘాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు, అగ్రి ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్లు, వ్యవసాయ సంబంధ టెక్నాలజీ డెవలపర్లకు ఈ ఫండ్ ద్వారా సబ్సిడీపై లోన్లు అందజేస్తామని మంత్రి చెప్పారు. ఈ ఏడాది పదివేల కోట్లతో మొదలెట్టి వచ్చే సంవత్సరం నుంచి ఏటా 30 వేల కోట్ల రుణాలు అందజేస్తామని తెలిపారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇటీవల ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఈ ఫండ్ భాగమని మంత్రి చెప్పారు. ‘ఫండ్ ఏర్పాటు నిర్ణయం.. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే చరిత్రాత్మక నిర్ణయం’ అని తోమర్ పేర్కొన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ట్రాన్స్ఫోర్ట్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ సదుపాయాలతో రైతులు తమ పంటలకు మంచి ధర పలికే వరకు వేచి చూసే అవకాశం దొరుకుతుందని, ఫుడ్ వేస్టేజ్ తగ్గుతుందని మంత్రి వివరించారు. ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ అన్నా యోజన కింద మరో ఐదు నెలల పాటు రేషన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, ‘ఈ రోజు కేబినెట్ తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలతో చాలా మంది జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి’ అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
కేబినెట్ఇంకొన్ని నిర్ణయాలు..
- అర్బన్ మైగ్రేట్స్, నిరు పేదలపై ఇంటి కిరాయి భారాన్ని తగ్గించేందుకు ‘అఫర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్’ స్కీముకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద 100 సిటీలలో మరో 1.15 లక్షల సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు కట్టి, పేదలకు తక్కువ మొత్తానికి రెంట్కు ఇస్తారు.
- దేశంలోని ఏడున్నర కోట్ల మంది పేద మహిళలకు ఎల్పీజీ సిలిండర్లు అందించేందుకు రూ.13,500 కోట్లు.
- ఈపీఎఫ్ చెల్లింపులను మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం.. దీంతో 72 లక్షల మంది ఉద్యోగులకు మేలు కలగనుంది. దీనికోసం
రూ. 4,800 కోట్లు. - ప్రభుత్వ రంగ జనరల్ఇన్సూరెన్స్ కంపెనీలు మూడింటికి రూ. 12,450 కోట్ల కేటాయింపు