- జాబ్, కోచింగ్ టైంను బట్టి భారీగా వసూళ్లు
- కానిస్టేబుల్ కోచింగ్కు 15 వేలు
- గ్రూప్ 1కు 30 వేలదాకా ఫీజు
- పేరున్న ఇనిస్టిట్యూట్లలో 40 వేలు
- ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పేద అభ్యర్థులు
- టీ శాట్లో మొదలవని క్లాసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో భాగంగా 30,453 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. ఊర్ల నుంచి హైదరాబాద్కు తరలి వస్తున్నారు. కరోనా మహమ్మారి, నోటిఫికేషన్లు లేకపోవడం వంటి కారణాలతో ఇన్నాళ్లూ వెలవెలబోయిన కోచింగ్సెంటర్లు.. ఇప్పుడు నిరుద్యోగుల రాకతో కళకళలాడిపోతున్నాయి. ఇప్పటికే ఉన్నవి కాకుండా.. కొత్తవి కూడా పుట్టుకొచ్చాయి. అయితే, ఆ కోచింగ్ సెంటర్లు తమకు ఇష్టమొచ్చినట్టు భారీగా ఫీజులను వసూలు చేస్తూ.. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దండుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాబ్ కొట్టాలంటే కోచింగ్ తీస్కుంటేనే సాధ్యమవుతుందన్న ఆలోచనతో నిరుద్యోగులు కష్టమైనా ఫీజులు కడుతున్నారు. కట్టలేని వాళ్లు తమతమ జిల్లాల్లోనే కోచింగ్ తీసుకుంటున్నారు.
షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ దాకా..
సబ్జెక్ట్ వారీగా లేదంటే సిలబస్ మొత్తం చెప్పేలా కోచింగ్ సెంటర్లు షెడ్యూల్ను ప్రిపేర్ చేసుకుంటున్నాయి. 3 నెలల షార్ట్ టర్మ్ కోచింగ్ నుంచి.. ఎగ్జామ్ నిర్వహించే తేదీ వరకు లాంగ్ టర్మ్ కోచింగ్లకు ప్లానింగ్ చేస్తున్నాయి. ప్రిపేర్ అయ్యే జాబ్, కోచింగ్ తీసుకునే టైంను బట్టి ఫీజులను వసూలు చేస్తున్నాయి. కానిస్టేబుల్ కోచింగ్ కోసం రూ.15 వేలు, ఎస్సై కోచింగ్కు రూ.20 వేల దాకా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గ్రూప్1 కోచింగ్కు రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇక, పేరున్న ఇనిస్టిట్యూట్లు అయితే రూ.40 వేల దాకా చెప్తున్నాయని అంటున్నారు. టెట్ కోచింగ్కు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా తీసుకుంటున్నారు. కాగా, ఇప్పటికే కొన్ని కోచింగ్ సెంటర్లు సిలబస్ను స్టార్ట్ చేశాయి. ఏ జాబ్కు ప్రిపేర్ కావాలన్నా కనీసం రూ.15 వేల ఫీజు కట్టాల్సిందేనని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చెప్తున్నారు. అయితే, కోచింగ్ సెంటర్ల ఫీజులపై ప్రభుత్వానికి ఎలాంటి కంట్రోల్ లేకుండాపోవడంతో కోచింగ్ సెంటర్లు ఇష్టమొచ్చినట్టు ఫీజులను వసూలు చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
పేదోళ్లకు తిప్పలు
కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తుండడంతో పేద అభ్యర్థులపై ప్రభావం ఎక్కువగా పడుతోంది. కరోనాతో ఇప్పటికే చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంత ఫీజు కట్టడంతో పాటు.. హాస్టల్కు నెలనెలా రూ.4 వేలు చెల్లించడం భారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటితో పాటు పుస్తకాలు, ఇతర ఖర్చులకు మరో రూ.2 వేలు అవసరమవుతాయని, అంత కట్టే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇక, కోచింగ్ సెంటర్లు ఎక్కువున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జవహర్నగర్, అశోక్నగర్, చిక్కడపల్లి, హిమాయత్నగర్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఎల్లారెడ్డిగూడ, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో హాస్టళ్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. కరీంనగర్, ఖమ్మం సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు వరంగల్లో కోచింగ్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లెక్కడ?
ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం టీ శాట్ ద్వారా ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి క్లాసులూ మొదలు కాలేదు. దానిమీద కనీసం ప్రచారం కూడా చేయట్లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు పెట్టారు. ఎమ్మెల్యేలంతా వారివారి నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు పెడితే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామనీ కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే, దానిపై ఇటు ఎమ్మెల్యేలుగానీ..ప్రభుత్వం గానీ చప్పుడు చేయట్లేదు. ప్రభుత్వం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉపయోగపడుతుందని, వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
సర్కార్ ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెట్టాలె
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఫీజులు ఎక్కువ చెప్తున్నరు. అందరూ కట్టుకోలేరు. ప్రభుత్వం నియోజకవర్గానికో ఫ్రీ కోచింగ్ సెంటర్ పెడ్తమని చెప్పింది కదా.. అదేదో తొందరగా ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతది. టీ శాట్ క్లాసులను వెంటనే స్టార్ట్ చెయ్యాలె.
- అమృత్సింగ్, నిజామాబాద్
కోచింగ్ సెంటర్లను కంట్రోల్ చేయాలె
ఇష్టమొచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం కంట్రోల్ చేయాలె. ఒక్క గ్రూప్1 కోసం రూ.30 వేలు అడుగుతున్నరు. ఒక్కో దాంట్లో ఒక్కోలా ఫీజులు పెడుతున్నరు. ప్రభుత్వం ప్రైవేటు ఇనిస్టిట్యూట్లను మానిటర్ చేయాలె.
- కటుక గణేశ్, కామారెడ్డి