న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) 2023లో రూ. 1.7 లక్షల కోట్లను భారత ఈక్విటీ మార్కెట్లలోకి ఇన్వెస్ట్ చేశారు. డిసెంబర్లో రూ. 66,134 కోట్ల ఇన్ఫ్లోలు వచ్చాయి. ఇక నుంచి కూడా ఎఫ్పీఐల పెట్టుబడులు బలంగా ఉంటాయని భావిస్తున్నారు. 2024 అంతటా యూఎస్ వడ్డీ రేట్లలో తగ్గుదల ఉంటుందని అంచనా. దీనివల్ల ఎఫ్పీఐలు తమ కొనుగోళ్లను పెంచే అవకాశం ఉంది.
ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు ముందు కొత్త సంవత్సరం ప్రారంభ నెలల్లో భారీగా షేర్లు కొనే అవకాశాలు ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.2023లో ఎఫ్పీఐలు ఈక్విటీల్లో రూ.1.71 లక్షల కోట్లు, డెట్ మార్కెట్లలో రూ.68,663 కోట్ల నికర పెట్టుబడి పెట్టారు. వీరంతా కలిసి క్యాపిటల్ మార్కెట్లో రూ.2.4 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల దూకుడు రేట్ల పెంపుతో గత ఏడాది ఎఫ్పీఐలు రూ. 1.21 లక్షల కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. ఎఫ్పీఐలు 2021లో రూ. 25,752 కోట్లు, 2020లో రూ. 1.7 లక్షల కోట్లు, 2019లో రూ. 1.01 లక్షల కోట్లు మార్కెట్లలోకి పంపించారు.
మూడు ముఖ్యమైన రాష్ట్రాలలో ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ విజయం సాధించిన కారణంగా, మెరుగైన రాజకీయ సుస్థిరత ఉంటుందనే అంచనాతో వీళ్లు డిసెంబర్లో రూ. 1.71 లక్షల కోట్లను మార్కెట్లో గుమ్మరించారు. డిసెంబర్లో భారీ ఇన్ఫ్యూషన్కు ముందు, అంతకుముందు మూడు నెలల్లో ఎఫ్పీఐ ఇన్ఫ్లోలు ప్రతికూలంగా ఉన్నాయి.యూఎస్ బాండ్ ఈల్డ్లలో తగ్గుదల ఎఫ్పీఐల వ్యూహంలో ఈ ఆకస్మిక మార్పుకు కారణమని విజయకుమార్ చెప్పారు.
మూడేళ్ల తరువాత...
మూడు సంవత్సరాల తిరోగమనం తర్వాత, విదేశీ పెట్టుబడిదారులు ఈ సంవత్సరం మార్కెట్లలో దూకుడు పెంచారు. 2023లో రూ. 68,663 కోట్లు కుమ్మరించారు. డిసెంబర్లోనే రూ.18,302 కోట్ల పెట్టుబడి ఉంది. అయితే 2022లో రూ.15,910 కోట్లు, 2021లో రూ.10,359 కోట్లు, 2020లో రూ.1.05 లక్షల కోట్ల విలువైన నిధులను డెట్ మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు తీసుకున్నాయి. వచ్చే ఏడాది జూన్ నుంచి భారత ప్రభుత్వ బాండ్లను బెంచ్మార్క్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో చేర్చుతామని సెప్టెంబర్లో జేపీ మోర్గన్ చేజ్ అండ్ కో చేసిన ప్రకటన దేశ బాండ్ మార్కెట్లలో ఇన్ఫ్లోను ప్రభావితం చేసింది. రాబోయే 18–24 నెలల్లో భారత మార్కెట్లు సుమారు 20-–40 బిలియన్ డాలర్లను ఆకర్షిస్తాయని అంచనా.
