- సర్కార్ ఖజానాకు రూ.17 వేల కోట్లు 26% పెరిగిన జీఎస్టీ వసూళ్లు
- భారీగా లిక్కర్ సేల్స్, రిజిస్ట్రేషన్లు మొదటి నాలుగు నెలల్లో
- రూ.54 వేల కోట్లు అందులో అప్పులే రూ.20 వేల కోట్లు
హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లూ పడిపోయిన రాష్ట్ర ఆదాయం.. లాక్డౌన్ ఎత్తేశాక పెరిగింది. జులైలో సర్కార్కు భారీగా ఆమ్దానీ వచ్చింది. పన్నుల వసూళ్లు, భూముల అమ్మకంతో పాటు రిజిస్ట్రేషన్లతో మంచి రాబడి సమకూరింది. జూన్తో పోలిస్తే జులైలో జీఎస్టీ వసూళ్లు 26 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో కేంద్రం జులై నెల పరిహారాన్ని విడుదల చేసింది. దానికి తోడు ప్రభుత్వం రూ.4 వేల కోట్లు అప్పుగా తీసుకుంది. మొత్తంగా పన్నులు, భూముల అమ్మకం, జీఎస్టీ పరిహారం, కేంద్ర వాటా, ఇతర గ్రాంట్లు, అప్పులు కలిపి రాష్ట్ర సర్కార్ కు రూ.17 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) రాష్ట్ర పన్ను ఆదాయం రూ.20 వేల కోట్లు కాగా.. ఒక్క జులైలోనే రూ.9 వేల కోట్లు వచ్చాయి.
రిజిస్ట్రేషన్ చార్జీలు.. లిక్కర్ వసూళ్లు
రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువను సఋర్కార్ పెంచుతుందన్న వార్తలతో జులైలో జనాలు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు పెరగడంతో.. రిజిస్ట్రేషన్ల రూపంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. మామూలుగా ప్రతి నెలా సగటున రూ.550 కోట్ల మేర ఆదాయం వస్తే.. ఒక్క జులైలోనే రూ.785 కోట్ల ఆమ్దానీ వచ్చింది. ఇటు జీఎస్టీ వసూళ్లు రూ.700 కోట్లు ఎక్కువగా నమోదయ్యాయి. రూ.3,610 కోట్ల జీఎస్టీ వసూలైంది. జూన్ 19న లాక్డౌన్ ఎత్తేయడం, వ్యాపారాలు పుంజుకోవడంతోనే జులైలో జీఎస్టీ కలెక్షన్లు పెరిగాయని అధికారులు చెప్తున్నారు. ఇటు లిక్కర్ అమ్మకాల ద్వారా కూడా భారీ ఆదాయం నమోదైంది. గత నెలలో రూ.2,775 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా.. అందులో ప్రభుత్వానికి రూ.1,500 కోట్లు ఎక్సైజ్ పన్నుల రూపంలో వచ్చాయి. పెట్రోల్, డీజిల్ పన్నులతో రూ.2,200 కోట్లు, ఇతర పన్నులు, సుంకాలతో మరో రూ.300 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రవాటాగా మరో రూ.600 కోట్లు వచ్చాయని అధికారులు చెప్తున్నారు.
భూముల అమ్మకం.. మరిన్ని అప్పులు
ఆదాయం పెంచుకోవడానికి ఈమధ్య ప్రభుత్వం కోకాపేట, ఖానామెట్లలో భూములను అమ్మింది. ఒక్క కోకాపేట భూముల ద్వారానే రూ.2,035 కోట్ల ఆదాయం వచ్చింది. ఖానామెట్ భూముల అమ్మకంతో రూ.729 కోట్లు వచ్చాయి. ఖానామెట్ భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. ఆర్బీఐ నుంచి మరో రూ.4 వేల కోట్లు అప్పుగా తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏడాది మొదటి 4 నెలల్లోనే అప్పులు సహా రూ.54 వేల కోట్ల ఆమ్దానీ వచ్చింది. మొదటి 3 నెలల్లో రూ.37,500 కోట్లు వచ్చాయి. ఈ 4 నెలల ఆదాయంలో అప్పులే రూ.20 వేల కోట్లున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. నెలనెలా రూ.17 వేల కోట్ల ఆదాయం వస్తేనే బడ్జెట్లో చెప్పిన వాటిఖర్చులకు సరిపోతాయని అంటున్నారు.