- 9 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
- టెలీగ్రామ్, వాట్సాప్లో వర్క్ ఫ్రం హోం, పార్ట్ టైమ్ జాబ్స్ అంటూ లింక్స్
- వాటిని ఓపెన్ చేశాక.. పెట్టుబడుల కోసం వల
- తక్కువ ఇన్వెస్ట్మెంట్తో భారీ లాభాలు
- వస్తాయని బురిడీరూ. 28 లక్షలు పోగొట్టుకున్న
- చిక్కడపల్లి యువకుడుఅతడి ఫిర్యాదుతో తీగలాగిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: చైనా కేంద్రంగా సాగుతున్న సైబర్ నేరగాళ్ల ఇన్వెస్ట్మెంట్ స్కామ్ గుట్టురట్టయింది. వర్క్ ఫ్రమ్ హోం, పార్ట్టైమ్ జాబ్స్ అంటూ టెలిగ్రామ్, వాట్సాప్లో లింకులు పంపి.. వాటిని ఓపెన్ చేశాక పెట్టుబడుల పేరిట వల విసరడం ఈ సైబర్ నేరగాళ్ల పని. తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపి ముగ్గులోకి దింపి.. కోట్లకు కోట్లు కొట్టేశారు. ఇట్లా దేశవ్యాప్తంగా 15వేల మంది నుంచి రూ. 712 కోట్లు లూటీ చేశారు. బాధితుల్లో ఎక్కువ మంది నిరుద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కార్పొరేట్ ఉద్యోగులే ఉన్నారు.
హైదరాబాద్లోని చిక్కడపల్లికి చెందిన బాధితుడు కృష్ణకుమార్ ఫిర్యాదుతో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేయగా.. ఎన్నో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహ్మద్ మున్వర్, అరుల్దాస్, షా సుమైర్, షమీర్ ఖాన్, ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి, నయీముద్దీన్ షేక్, గగన్ కుమార్ సోని, పర్వేజ్ అలియాస్ గుడ్డు అనే తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి బ్యాంక్ అకౌంట్స్లోని రూ. 10.54 కోట్లు ఫ్రీజ్ చేశారు. 17 సెల్ఫోన్స్, 22 సిమ్కార్డులు, 33 కంపెనీలకు చెందిన ఫేక్ డాక్యుమెంట్స్, చైనాకు చెందిన 12 యువాన్ కరెన్సీ నోట్స్, 6 కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ వివరాలను అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్,సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రతో కలిసి సీపీ సీవీ ఆనంద్ శనివారం మీడియాకు వెల్లడించారు. స్కామ్లో చైనాకు చెందిన లీ లౌ, గుయాంగ్జౌ.నన్ ఏ, కెవిన్ జూన్ అనే ముగ్గురిని ప్రధాన నిందితులుగా గుర్తించారు.
చిక్కడపల్లి యువకుడి ఫిర్యాదుతో..!
చిక్కడపల్లికి చెందిన కృష్ణకుమార్కు టెలీగ్రామ్లో ఈ ఏడాది మార్చి 17న ‘రేట్ అండ్ రివ్యూ’ పేరుతో పార్ట్ టైమ్ జాబ్ మెసేజ్ వచ్చింది. లింకులో పేర్కొన్న విధంగా https://www.traveling-99.com వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తర్వాత సదరు వెబ్సైట్ వాళ్లు ఆన్లైన్ వ్యాలెట్లో కృష్ణకుమార్ నుంచి రూ. 1,000 ఇన్వెస్ట్ చేయించారు. మొదటిసారి అతడికి రూ. 866 ప్రాఫిట్ వచ్చినట్లు వ్యాలెట్లో కనిపించింది. అట్లనే టాస్క్లు ఇస్తూ విడతల వారీగా రూ. 28 లక్షలు కృష్ణకుమార్ నుంచి వసూలు చేశారు. ఇన్వెస్ట్ చేసిన నగదు ప్రాఫిట్ మొత్తం బాధితుడికి వ్యాలెట్లో కనిపించింది. అయితే.. దాన్ని విత్ డ్రా చేసుకోవడానికి రాకపోయేసరికి మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేశారు. బాధితుడి డబ్బు 6 అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు.
ఇందులో హైదరాబాద్కు చెందిన రాధిక మార్కెటింగ్ అకౌంట్తో పాటు దేశవ్యాప్తంగా 48 అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లు ఆధారాలు సేకరించారు. ఈ అకౌంట్లలో రూ. 584 కోట్ల డిపాజిట్స్ను గుర్తించారు. ఇతర అకౌంట్లలో మరో రూ. 128 కోట్లు గుర్తించారు. హైదరాబాద్లోని రాధిక మార్కెటింగ్ అకౌంట్ హోల్డర్ మహ్మద్ మున్వర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. మున్వర్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్కు చెందిన అరుల్దాస్, షా సుమైర్, షమీర్ ఖాన్, గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి, ముంబైకి చెందిన నయీముద్దీన్ షేక్, గగన్ కుమార్ సోని, ఫర్వేజ్ అలియాస్ గుడ్డును అరెస్ట్ చేశారు. చైనా కేంద్రంగా ఇన్వెస్ట్మెంట్ రాకెట్ నడుస్తున్నదని, టెర్రరిస్టు లింకులు ఉన్నట్లు గుర్తించామని, దీన్ని ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లకు సమాచారం అందిస్తామని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
టాస్క్ ఫ్రాడ్స్లో చైనీస్ మాస్టర్ మైండ్
ఆన్లైన్ యాప్స్లో చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు మాస్టర్ మైండ్గా పనిచేస్తున్నారు. యాప్స్ డెవలప్ చేసి ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ చేస్తున్నారు. చైనాకు చెందిన లీ లౌ, గుయాంగ్జౌ.నన్ ఏ, కెవిన్ జూన్ అనే ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కోసం స్పెషల్ యాప్స్ క్రియేట్ చేశారు. వర్క్ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ జాబ్ పేరుతో టెలీగ్రామ్, వాట్సాప్లో లింక్స్ సర్క్యులేట్ చేశారు. లింక్స్ ఓపెన్ చేసిన వారికి ఇన్వెస్ట్ మనీ, క్యాష్ విత్డ్రా, పెర్ఫామ్ టాస్క్ పేరుతో ట్రాప్ చేస్తున్నారు. 30 టాస్క్లతో ఇన్వెస్ట్ చేయించి వర్చువల్ అకౌంట్స్లో లాభాల ఆశ చూపిస్తున్నారు.
దుబాయి నుంచే అకౌంట్స్ ఆపరేషన్
బ్యాంక్ అకౌంట్స్ను దుబాయి నుంచే ఆపరేట్ చేశారు. ఇందుకోసం ముంబైకి చెందిన ఆరిఫ్, ఆనస్, ఖాన్ భాయ్, పీయూష్, శైలేశ్ దుబాయిలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక సిమ్ కార్డులు, ఐపీ అడ్రెస్లతో పోలీసులకు చిక్కకుండా ప్లాన్ చేశారు. దుబాయి గ్యాంగ్తో పాటు చైనా సైబర్ నేరగాళ్లకు ప్రకాశ్ ప్రజాపతి రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవాడు. కూల్టెక్, ఎయిర్డ్రాయిడ్ అనే రిమోట్ యాక్సెస్ ద్వారా బ్యాంక్ అకౌంట్స్, ఓటీపీ నంబర్స్ షేర్ చేసేవాడు. ఈ క్రమంలో దుబాయికి వెళ్లివస్తుండేవాడు. ఇండియా ఫోన్ నంబర్స్ వాడకుండా దుబాయి, చైనా నంబర్స్ వినియోగించేవాడు. ఇండియా కరెన్సీని దుబాయిలో క్రిప్టో కరెన్సీగా మర్చేవారు. చైనా నుంచి ఎలక్ట్రానిక్ బైక్స్ కొనుగోలు చేస్తున్నట్లు రుక్షిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పేరుతో హవాలా ట్రాన్సాక్షన్స్ చేసేవారు. మొత్తం దేశవ్యాప్తంగా 15,000 మంది బాధితుల వద్ద రూ. 712 కోట్లు ఆన్లైన్లో కొట్టేశారు.
క్రిప్టో కరెన్సీ రూపంలో చైనాకు
గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ప్రకాశ్ ప్రజాపతితో లీ లౌ, గుయాంగ్జౌ.నన్ ఏ, కెవిన్ జూన్ కాంటాక్ట్ అయ్యారు. అతడి ద్వారా స్కామ్ను నడిపించారు. లక్నోకు చెందిన మనీష్, వికాస్, రాజేశ్ వద్ద బ్యాంక్ అకౌంట్స్ను ప్రకాశ్ ప్రజాపతి సేకరించాడు. హైదరాబాద్కు చెందిన రాధిక మార్కెటింగ్ అకౌంట్ హోల్డర్ మహ్మద్ మున్వర్ తో పాటు అరుల్దాస్, షాసుమైర్, షమీర్ఖాన్తో 33 షెల్ కంపెనీలు రిజిస్టర్ చేయించాడు. గగన్ అనే వెబ్ డిజైనర్తో వీటిని డిజైన్ చేయించాడు. వీటి ద్వారా 65 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. వీటిని ప్రకాశ్ ప్రజాపతి సేకరించాడు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో వసూలు అయిన డబ్బును ఈ అకౌంట్స్లో డిపాజిట్ చేసేలా ప్లాన్ చేశాడు. వీటిలో పాటు ముంబై, అహ్మదాబాద్లో రూ. 2 లక్షలు కమీషన్గా ఇస్తూ మరికొన్ని అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఇలా ఫ్రాడ్స్ ద్వారా కొట్టేసిన డబ్బు దుబాయి నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో చైనాకు చేరింది.
హిజ్బుల్ టెర్రర్ లింక్
అహ్మదాబాద్కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో కీలకంగా వ్యవహరిం చాడు. 65 ఇండియన్ అకౌంట్స్ను చైనీస్కు అందించాడు. ఫేక్ అకౌంట్స్, మనీలాండరింగ్, ఆన్లైన్లో ఇల్లీగల్ ట్రాన్జాక్షన్స్ నిర్వహించేవాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ సమకూర్చేవాడు. ట్రోన్ వ్యాలెట్తో ట్రాన్జాక్షన్స్ చేసేవాడు. ఈ క్రమంలోనే హిజ్బుల్ టెర్రర్ గ్రూప్కు రెండు వ్యాలెట్స్ నుంచి క్రిప్టో ట్రాన్స్ఫర్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.