
- నిర్మాణానికి కేంద్రం రెడీగా ఉన్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
- తీరనున్న గన్నేరువరం ప్రజల చిరకాల కోరిక
కరీంనగర్, వెలుగు: రూ.77 కోట్ల వ్యయంతో 18 కి.మీల పొడువునా హైలెవెల్ బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి అందాయని సీఆర్ఎఫ్ఐ కింద ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి, పోతారం నుంచి బావుపేట, ఖాజీపూర్ వరకు లోయర్ మానేరు డ్యామ్ మీదుగా రోడ్డు, హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం రెడీగా ఉందని ఆయన తెలిపారు.
త్వరలో గన్నేరువరం ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి మేరకు ఆయన శనివారం ఉదయం తిమ్మాపూర్ ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా గన్నేరువరం మండలం గుండ్లపల్లి పోతారం నుంచి బావూపేట, ఖాజీపూర్ వరకు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదనలపై చర్చించారు. మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్డి నిర్మించాలని స్థానిక ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే ప్రస్తావించగా, తప్పకుండా మండల ప్రజల కల నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం సహకరిస్తే ఎప్పుడో గన్నేరువరం బ్రిడ్జి పూర్తయ్యేదని, రాజకీయ కక్షతో వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందికి గురిచేసిందని బండి సంజయ్ ఆరోపించారు.
మానకొండూరును డెవలప్ చేస్తాం
తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్తో పాటు మానకొండూర్ నియోజకవర్గ డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని అన్నదమ్ముళ్లలా కలిసి పనిచేస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని రామకృష్ణకాలనీలో ఈజీఎస్ నిధులు రూ.75 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రూ.1.10 కోట్లతో మానకొండూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పనులు చేస్తున్నామని తెలిపారు. గన్నేరువరం నుంచి చింతకుంట వరకు మానేరు నది మీదుగా వంతెనను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఎన్నికల వరకే రాజకీయాలని, ప్రస్తుతం వాటన్నిటిని పక్కన పెట్టి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్ మండలాధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, బండారి రమేశ్, మాజీ సర్పంచ్గుజ్జుల ప్రణీత్ రెడ్డి, సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోరపల్లి రమణారెడ్డి, ఎడ్ల జోగిరెడ్డి, దావు సంపత్ రెడ్డి, ఓదెలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.