మామూలుగా ఎన్నికలనగానే ఎంతో హడావిడి ఉంటుంది. పార్టీ నేతలంతా తమ అభ్యర్థినే ఎన్నుకోవాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ రాజస్థాన్ రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం దీనికి విరుద్ధంగా ఓ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ పార్టీకి చెందిన ధోల్పూర్ ఎమ్మెల్యే శోభా రాణి కుశ్వాహా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. రాజస్థాన్ లో ఇటీవల నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. బీజేపీ తరపున ఇద్దరు, కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే శోభా రాణి, పార్టీ విప్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి ఓటు వేయడంతో ఆమెపై బహిష్కరణ వేటు వేశారు.దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులులైన రన్దీప్ సుర్జేవాలా,ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ విజయం సాధించగా, బీజేపీ మాత్రం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది.2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే రాణి కుశ్వాహా ఇదే తరహాలో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. అప్పడు కూడా ఇలాగే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటువేశారు. అయితే కావాలని ఓటేయలేదని, పొరపాటు జరిగిందని చెప్పటడంతో అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సీన్ మళ్లీ రిపీడ్ కావడంతో.. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శోభారాణిపై చర్యలు తీసుకున్నారు.