- ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ వాడినా రూ. వెయ్యి కట్టాల్సిందే
- సిగ్నల్ జంప్ చేస్తే రూ. 2 వేలు జరిమానా
- మోటర్ వెహికల్ యాక్ట్లో సవరణలు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: టూవీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ధరించినప్పటికీ దానికున్న పట్టీ సరిగ్గా పెట్టుకోకపోయినా వెయ్యి రూపాయల ఫైన్ తప్పదు. వాడే హెల్మెట్ ఐఎస్ఐ మార్క్కు సంబంధించింది కాకపోయినా రూ. 1,000 జరిమానా చెల్లించాల్సిందే. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ సిగ్నల్ జంప్ చేసినా, ఇతర ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా.. రూ. 2 వేల దాకా ఫైన్ పడుతుంది. హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ, ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్లను నిషేధిస్తూ 2021లోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, చాలా మంది ఈ రూల్స్ పాటించడం లేదు. దీంతో కేంద్రం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు తాజాగా మోటార్ వెహికల్ యాక్ట్ 1998లో మార్పులు తీసుకువచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. చలాన్లు తప్పించుకోవడం కోసం కొందరు హెల్మెట్ను తలకు తగిలించుకోవడం తప్పితే దానికున్న బటన్/బకిల్ను పెట్టుకోవడం లేదు. ఇలాంటి చర్యల వల్ల.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ తలపై నుంచి ఎగిరిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురవుతున్నది.
నిబంధనలు, జరిమానాలు ఇట్లా..
- బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తలకు పెట్టుకున్నప్పటికీ దాని పట్టీ/బ్యాండ్ పెట్టుకోకుంటే రూ. వెయ్యి ఫైన్.
- వాడే హెల్మెట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికెట్, లేదా ఐఎస్ఐ మార్క్ ఉన్నవై ఉండాలి. ఇవి తప్ప వేరే హెల్మెట్లు వాడితే రూ. వెయ్యి జరిమానా పడుతుంది.
- ఐఎస్ఐ మార్క్లేని హెల్మెట్ ధరించి, దానికున్న పట్టీ సరిగ్గా పెట్టుకోకపోతే.. రెండు ఉల్లంఘనల కింద రూ. 2 వేల ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
- హెల్మెట్ను కరెక్ట్గా పెట్టుకున్నప్పటికీ.. రెడ్ సిగ్నల్ను జంప్ చేసినా, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా రూ. 2 వేల వరకు జరిమానా పడుతుంది. పైగా 3 నెలల పాటు లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంది.