కాళేశ్వరం ఖర్చు.. ప్రతి నెలా రూ. 2 వేల100 కోట్లు

కాళేశ్వరం ఖర్చు.. ప్రతి నెలా రూ. 2 వేల100  కోట్లు

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్ల రీపేమెంట్లకు ఏటా రూ.13 వేల కోట్లకు పైగా అవసరం. రానున్న పదేండ్లు ఇంత భారీ మొత్తం కేటాయించక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టు అడిషనల్​టీఎంసీని కలుపుకుని కరెంట్​బిల్లులకు ఏటా రూ. 11,359 కోట్లు అవసరమవుతాయని కాగ్ లెక్క కట్టింది. ఇవి కాకుండా ప్రాజెక్టు ఆపరేషన్స్​ అండ్​ మెయింటనెన్స్​కు ఏటా ఇంకో రూ.272 కోట్లు కావాలి. ఈ లెక్కన ఏడాదికి కనీసం రూ.25,109  కోట్లు అవసరం.. అంటే నెలకు కనీసం రూ.2,100 కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆయకట్టుకు ఇచ్చే నీళ్లకు రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేస్తామని.. తాగునీరు, ఇండస్ట్రీస్​కు ఇచ్చే నీటి ద్వారా ఆదాయం సమకూరుతుందని ప్రాజెక్టు డీపీఆర్​లో ప్రభుత్వం పేర్కొంది. 

అట్ల వచ్చే ఆదాయంతోనే లోన్లు రీపేమెంట్​ చేస్తామని ఆయా ఫైనాన్స్​సంస్థలు, బ్యాంకులతో చేసుకున్న అగ్రిమెంట్లలోనూ పొందుపరిచింది. ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించి నాలుగేండ్లయినా గరిష్టంగా ఒక్క సీజన్​లో 74 వేల ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వలేదు. ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు ఈ ప్రాజెక్టు కింద పంట కాల్వలే లేవు. భగీరథకు, ఇతర నీటి పథకాలకు ఇచ్చే నీటికి ఇప్పటికైతే పన్నులు వసూలు చేయడం లేదు. ఒకవేళ వసూలు చేసినా ప్రజల నుంచి కాకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధుల నుంచే వాటిని తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. 

ALSO READ:కేసీఆర్​ పండరీపూర్​ టూర్​లో మటన్​కర్రీ పంచాదీ

పరిశ్రమల నుంచి ఇప్పటికైతే పెద్దగా ఆదాయం రావడం లేదు. దీంతో కాళేశ్వరం లోన్ల రీపేమెంట్లకు బడ్జెట్​లోనే నిధులు కేటాయించాల్సి వస్తున్నది. కరెంట్​బిల్లులు, ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్​ కోసం చేసే ఖర్చు దీనికి అదనం. ఈ లెక్కన మొత్తంగా ఒక్కో నెలకు కాళేశ్వరం కోసం రూ. 2,100 కోట్లు కావాలని, దీన్ని ఎట్ల సమకూరుస్తారని కాగ్​నిలదీసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా నెలకు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. ఇందులో ఐదో వంతు కాళేశ్వరం కోసమే ఖర్చు చేస్తే ప్రభుత్వ నిర్వహణ,  ఇతర వ్యవహారాలను ఎట్ల చక్క బెడుతారని కాగ్​ప్రశ్నించింది.