
కార్మికశాఖలో రూ.670 కోట్లకు లెక్కలు దొరకడం లేదు. కోవిడ్ సమయంలో నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా రూ. 258 కోట్లు కార్మికులకు, వలస కూలీలకు నగదు అందజేసినట్లు కార్మిక శాఖ చెబుతోంది. మిగిలిన డబ్బు పౌరసరఫరాల శాఖ నుంచి రావాల్సి ఉందని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు తెలిపింది. అయితే తమకు బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్టు సెక్షన్ కు ఎలాంటి నిధులూ రాలేదని పౌరసరఫరాల శాఖ చెబుతోంది.
ఉచిత బియ్యంతో పాటు నగదు సాయం కోసం రూ.335 కోట్లను పౌరసరఫరాల శాఖకు రీయింబర్స్ చేయాలని లేబర్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ కార్యదర్శికి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు లెటర్ రాశారు. దీంతో పాటు భవిష్యత్ లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరో రూ.699. 88 కోట్లు అడ్వాన్స్ గా జనరల్ అండ్ అదర్ రెవెన్యూ ఫండ్స్ , డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ , స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ , కాంట్రీబూషన్ టు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఖాతాలకు జమ చేయాలని ఆదేశించారు. దీంతో వెయ్యి ఐదు కోట్లను కార్మిక శాఖ నుంచి పౌరసరఫరాల శాఖకు బదిలీ చేశారు అధికారులు.
కానీ సదరు పౌరసరఫరాల శాఖ మాత్రం నిధులెక్కడివని అంటోంది. అయితే, ఈ నిధులు ఎక్కడికి వెళ్లాయి? ఎవరు ఖర్చుచేశారు? మిగిలిన నిధులు ఎవరి దగ్గర ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. తమ నిధులను తిరిగి చెల్లించాలని పౌరసరఫరాల శాఖకు కార్మిక శాఖ అధికారులు ఐదుకు పైగా లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు బయటికి రానివ్వడం లేదు. దీతో కార్మిక శాఖలో రూ.670 కోట్లు ఏమైయ్యాయనేది అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు చాలా నిర్మాణరంగ సంస్థలు ప్రభుత్వానికి సెస్ ఎగ్గొట్టినట్లు విజిలెన్స్ కమిటి నివేదిక ఇచ్చింది. తెలంగాణ రాక ముందు వంద కోట్లు.. రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు రూ.900 కోట్ల సెస్ ....ఇప్పటివరకు వసూలు కాలేదని నివేదికను బట్టి తెలుస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల సెస్ ఎగ్గొట్టినట్లు విజిలెన్స్ నివేదిక ఇచ్చినా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.