- టీఎంయూ మినహా 10 యూనియన్లతో జేఏసీ
- చైర్మన్గా రాజిరెడ్డి, వైస్ చైర్మన్గా హనుమంతు
- సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమమేనని స్పష్టం
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ యూనియన్లు మరోసారి ఉద్యమబాట పట్టాయి. డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారానికి అన్నీ ఏకమయ్యాయి. 10 యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. యూనియన్ల నేతలు సోమవారం అధికారికంగా జేఏసీని ప్రకటించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) మినహా అన్ని యూనియన్లు జేఏసీలో చేరాయి.
ఆర్టీసీలో యూనియన్లకు స్థానం లేదని 2019 సమ్మె తర్వాత సీఎం కేసీఆర్ చెప్పినప్పటి నుంచి యూనియన్లు స్తబ్దుగా ఉన్నాయి. యూనియన్ల స్థానంలో వెల్ఫేర్ కమిటీలు తీసుకొచ్చినా అవి పత్తాలేకుండా పోయాయి. దీంతో 49 వేల మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. 15వ తేదీ దాటినా జీతాలు రావట్లేదు. రెండు పీఆర్సీలు, నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. సీసీఎస్తో పాటు పీఎఫ్ డబ్బులు ఆర్టీసీ వాడేసుకుంది. సీసీఎస్ మూతబడే పరిస్థితి వచ్చింది. అధికారుల వేధింపులు పెరిగాయి. ఉద్యోగులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అవస్థ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఉద్యమానికి యూనియన్లు సిద్ధమయ్యాయి. తమ డిమాండ్లను కొట్లాడి సాధించుకోవాలని నిర్ణయించాయి. వినతిపత్రాల అందజేత, నిరసనలు, ధర్నాలు, ఆందోళనల రూపంలో ముందుకెళ్లనున్నాయి. అవసరమైతే మరోసారి మెరుపు సమ్మె చేస్తామన్నాయి. జేఏసీలో చేరికపై టీఎంయూను సంప్రదించారని, పరిస్థితులు సమీక్షించుకున్నాకే నిర్ణయం తీసుకుంటామని యూనియన్లోని ఓ కీలక నేత చెప్పారు.
10 యూనియన్లు కలిసి..
ఎంప్లాయీస్ యూనియన్, టీజేఎంయూ, ఎస్డబ్ల్యూఎఫ్, ఎన్ఎంయూ, ఎస్డబ్ల్యూయూ, కేఎస్ (బీఎంఎస్), బీకేయూ, బీడబ్ల్యూయూ, కేపీ, ఎస్టీఎంయూ కలిసి ఆర్టీసీ జేఏసీగా ఏర్పడ్డాయి. హైదరాబాద్లోని టీజేఎంయూ ఆఫీసులో సోమవారం జరిగిన సమావేశంలో జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్గా ఈయూ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్గా టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంతు ముదిరాజ్, కన్వీనర్లుగా ఎస్డబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీ వీఎస్రావు, ఎన్ఎంయూ ప్రెసిడెంట్ కమాల్రెడ్డి, కో కన్వీనర్లుగా యూనియన్ల నేతలు అబ్రహం, రమేశ్ కుమార్, యాదయ్య, సురేశ్, యాదగిరి, హరికిషన్ ఎన్నికయ్యారు.
సీసీఎస్ బకాయిల్లేవు.. జీతాలు పెంచలేదు: జేఏసీ
సమస్యలు పరిష్కరించే దాకా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ హనుమంతు ముదిరాజ్ స్పష్టం చేశారు. సోమవారం జేఏసీ ఏర్పడ్డాక వాళ్లు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పారని, కానీ ఇప్పటికీ పీఆర్సీ ప్రకటించలేదని మండిపడ్డారు. కొత్త బస్సులను కొంటలేరని, సీసీఎస్ బకాయిలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ రోజురోజుకూ దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. టీఎంయూ కూడా ప్రభుత్వానికి వత్తాసు పలకకుండా బయటకు వచ్చి పోరాడాలన్నారు. త్వరలోనే కార్యాచరణ రూపొందించి ఉద్యమాలకు సిద్ధమవుతామని తెలిపారు.