హైదరాబాద్ : RTCJAC పిలుపుతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు ఆర్టీసీ కార్మికులు. సమ్మెలో భాగంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటి ముట్టడికి యత్నించారు ఆర్టీసీ కార్మికులు. సికింద్రాబాద్ మొండా మార్కెట్ లోని ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు. పద్మారావు గౌడ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన కుమారుడు రామేశ్వర్ గౌడ్ కు వినతిపత్రం అందించారు. తన సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
కూకట్ పల్లి, శేర్ లింగంపల్లి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీల ఇళ్లను ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు ముట్టడించారు. సేవ్ ఆర్టీసీ అంటూ నినాదాలు చేశారు. 38 రోజులుగా సమ్మె చేస్తున్నా, ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదని ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఇంటిని ముట్టడించారు ఆర్టీసీ కార్మికులు. 38 రోజులుగా సమ్మె చేస్తున్నా సర్కార్ స్పందించటం లేదన్నారు. నేతలు కార్మికుల బాధను అర్థం చేసుకొని… సీఎంకు తెలియజేయాలన్నారు. సర్కార్ ఇప్పటికైనా స్పందించి… కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.